అమిత్ షా వ్యూహం: కెసిఆర్ పై 'నిజాం ' అస్త్రం
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రజలు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డాడు. తెలంగాణలో రజాకార్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా పాలన సాగుతోందో ప్రశ్ని
చిట్యాల:రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రజలు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డాడు. తెలంగాణలో రజాకార్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా పాలన సాగుతోందో ప్రశ్నించుకోవాలన్నారాయన.
మూడురోజుల పాటు తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాపైనే అమిత్ షా కేంద్రీకరించారు. మూడోరోజు చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. తెలంగాణసాయుధపోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారిని బుదవారం నాడు అమిత్ షా సన్మానించారు.
2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బిజెపి వ్యూహారచన చేస్తోంది.ఈ ప్రణాళికలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.
రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్గొండ జిల్లాను ఆ పార్టీ వేదికగా ఎంచుకొంది. అంతేకాదు నిజాం సర్కార్ ను కెసిఆర్ పొగిడేవాడు.నిజాం అనేక మంచి పనులను చేశాడని ఆయనను కీర్తించడంలో తప్పేమీటని ఆయన ప్రశ్నించేవాడు.అయితే కెసిఆర్ నిజాంను పొగడడాన్ని బిజెపి తప్పుబడుతోంది.ఇదే అంశాన్ని తీసుకొని బిజెపి రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన గుండ్రాంపల్లిలో అమిత్ షా సభ నిర్వహించడం వెనుక ఇదే ఉద్దేశ్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
టిఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రశ్నించుకోండి?
నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ గ్రామంలో ఎందరో మహానుభావులు రజాకార్లతో అలుపెరగని పోరాటం చేశారు. దీంతో ఈ గ్రామం చరిత్రలో నిలిచిపోయిందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. గ్రామంలోని దళితవాడలను సందర్శించారు. వారి స్థితిగతులను అడిగితెలుసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పనితీరును, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలనలో మహిళలపై అత్యాచారాలు చేశారు. రాక్షసంగా ప్రవర్తించారని ఆయన చెప్పారు.రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర గుండ్రాంపల్లికి ఉందన్నారు. ఆనాడు గ్రామస్థులు చేసిన పోరాటాలు మరుగున పడిపోయాయన్నారు. వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.రజాకార్ల విముక్తికోసం పోరాడిన వాళ్ళు పునరాలోచించుకోవాలన్నారు. రజాకార్ల చేతిలో మరణించిన అమరుల ఆశయాలకు అనుగుణంగా పాలన తేవడం కోసం బిజెపిని అధికారంలోకి రావాలన్నారు.
టిఆర్ఎస్ మా రాజకీయ ప్రత్యర్థే
టిఆర్ఎస్ మా రాజకీయ ప్రత్యర్థే.2019 లో స్వంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు అమిత్ షా చెప్పారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో రాజకీయపొత్తు ఉందన్నారు.అయితే ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు గురువారం నాడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణకు లక్షకోట్ల నిధులు
గత మూడేళ్ళుగా కేంద్రం నుండి లక్షకోట్లకు పైగా నిధులు ఇచ్చినట్టుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు.గత 70 ఏళ్ళలో ఏ ప్రభుత్వం కూడ ఇవ్వని నిధులను తెలంగాణకు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.13వ, ఆర్ధిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ.9,550 కోట్లు, 14వ, ఆర్థిక సంఘం ద్వారా రూ.96,706 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గతంలో కంటే స్థానిక సంస్థలకు 30 రెట్లు ఇచ్చినట్టు చెప్పారు. వీటితోపాటు ఎయిమ్స్, పలు యూనివర్శిటీలు, మౌలిక వసతులకు రూ.40,800 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.
కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకొంది
అమిత్ షా పర్యటనతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయం పట్టుకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు మానాలన్నారు. రజాకార్ల భాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలన్నారు. మోడీ, అమిత్ షా చరిష్మాలను చూసి కాంగ్రెస్ కు నిద్ర పట్టడం లేదన్నారు. బిజెపికి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా ఎలా పోరాడారో ..ఇప్పుడు అలాగే పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.