ప్రోటోకాల్ వివాదం: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో ఓ అభివృద్ధి పనిని ప్రారంభించేందుకు శుక్రవారం రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వచ్చారు.
ఇదే కార్యక్రమానికి ఎమ్మెల్సీ హోదాలో బీజేపీ నేత రామచంద్రరావు కూడా హాజరయ్యారు. అయితే శిలాఫలకంపై శిలాఫలకంపై రామచంద్రారావు పేరు లేని విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో బీజేపీ కార్యకర్తల నినాదాలపై అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్విదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాల నేతలకు సర్దిచెప్పారు. అనంతరం పాలమూరులో జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను మంత్రి మహేందర్రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గ్రామానికి బస్సులు నడిపేంతుగు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తవగానే ప్రతి గ్రామానికి బస్సులు నడుపుతామని ప్రకటించారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీలో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించేందుకు వారికి అవార్డులు ఇస్తున్నామన్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ పట్టణాలకు జేఎన్ఎన్యూఆర్ఎం కింద 130 బస్సులు మంజూరైనట్లు తెలిపారు.
త్వరలోనే 400 పల్లె వెలుగు, 100 ఏసీ బస్సులను ప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడుపుతామని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమన్నారు.
అందుకే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లులు కురిపించారని చెప్పారు. జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృషి పెట్టి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో బస్టాండ్లు, డిపోలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు మంచి జీతాన్ని అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గతంలో తెలంగాణ డిపోలకు పాత బస్సులను ఇచ్చి సీమాంధ్ర డిపోల్లో కొత్త బస్సులు తిప్పేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు నాలుగు రోడ్ల నిర్మాణంతో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని చెప్పారు.