స్టేషన్ లో పోలీసుల ఎదుటే.. అధికార, విపక్ష నేతలు డిష్యూం డిష్యూం
ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకుడు డోలి రమేష్ వర్గీయుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.. ఠాణాలో సైతం పోలీసుల ఎదుటే పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకుడు డోలి రమేష్ వర్గీయుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.. ఠాణాలో సైతం పోలీసుల ఎదుటే పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మైనంపల్లి, డోలి రమేష్ వర్గీయుల మధ్య చాలా కాలంగా వైరం ఉంది. కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి ఇరువర్గాలు హాజరయ్యాయి. అక్కడ మాటామాటా పెరిగింది. దీంతో డోలి రమేష్ వర్గీయులు టీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. ఇద్దరు నాయకులను చితకబాదారు.
విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు గాయపడ్డ వారితో కలిసి పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం సీఐ సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంతలో డోలి రమేష్ వర్గీయులు కూడా పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. దీంతో రమేష్, హన్మంతరావు మధ్య వాగ్వాదం జరిగింది.
పోలీసుల ఎదుటే రెండు వర్గాల వారు మళ్లీ దాడులు చేసుకోవడంతో ఠాణా రక్తసిక్తంగా మారింది. ఈ సమయంలో స్టేషన్లో కరెంటు లేకపోవడంతో ఎవరిపై ఎవరు దాడి చేస్తున్నారో పోలీసులు గమనించలేకపోయారు.
అనంతరం పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి శాంతింపచేశారు. రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇరువర్గాలకు చెందిన కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.