రూ.90 లక్షల కొత్త నోట్లను తరలిస్తూ పట్టుబడిన ముఠా: ఓ లేడీ పాత్ర
రూ.90 లక్షల రెండు వేల నోట్లను తరలిస్తూ ఓ ముఠా హైదరాబాదులో పట్టుబడింది. ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు ఓ మహిళ వద్ద 15 శాతం కమిషన్కు నోట్లను మార్చుకున్నట్లు తెలుస్తోంది. వాటిని తరలిస్తూ వారు
హైదరాబాద్: మామూలు జనాలు ఎటిఎంల వద్ద, బ్యాంకుల్లో పడిగాపులు పడుతూ డబ్బుల కోసం అంగలారుస్తుంటే, మరో వైపు అక్రమార్కులు దొడ్డిదారుల్లో నోట్ల కట్టలను తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఇటువంటి సంఘటనలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాదులో ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.
గురువారం రాత్రి హైదరాబాద్ నారాయణగూడలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా కొత్త నోట్లు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఐదుగురిని వ్యక్తులు కారులో తరలిస్తున్న రూ.90లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం కొత్త రెండు వేల నోట్లు కావడం విశేషం.
నగదు తరలిస్తున్న కారుతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీసులు విచారిస్తున్నారు. నారాయణగూడ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో వెళుతున్నవారిపై అనుమానం కలిగి సోదాలు నిర్వహించారు. దాంతో అసలు విషయం బయటపడింది.
ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన నాలుగురు ముఠా సభ్యులు నగరంలోని రామంతపూర్కు చెందిన ఓ మహిళతో 15 శాతం కమీషన్ మేరకు నోట్ల మార్పును కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రెండు వేల కోత్త నోట్లు కలిగిన రూ.90లక్షల 13వేలు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగురు ముఠా సభ్యులతో పాటు రామంతపూర్ ప్రాంతానికి చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.