శిరీష కేసు: ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టులో ఏం తేలింది?, అత్యాచారం జరగలేదా!
ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్టు.. అత్యాచారం జరగలేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక రిపోర్టులో స్మెర్మొటోజ కనిపించలేదని నిపుణులు పేర్కొన్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: ఎడతెగని మిస్టరీతో రెండు వారాలుగా మీడియాలో హైలైట్ అయిన బ్యుటీషియన్ శిరీష కేసులో.. ఎన్నో అనుమానాలకు సమాధానాలు ఇంకా దొరకనే లేదు. నిందితులు చెప్పే విషయాల్లో నిజమెంత? పోలీసుల విచారణ నిష్పక్షపాతమేనా? అన్న సందేహాలు కూడా కలగకమానడం లేదు.
తొలుత అనుమానాస్పద మృతిగా మొదలైన కేసు.. ఆపై ఆత్మహత్యగా.. అటుపై హత్యేమైనా? జరిగి ఉంటుందా అన్న కోణంలో మలుపు తిరిగింది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో.. ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. అయితే కస్టడీలోను నిందితులు పాత విషయాలే చెప్పడంతో శిరీష కేసు మళ్లీ మొదటికే వచ్చింది.
బ్యూటీషియన్ శిరీష కేసు క్లోజ్ అయినట్లేనా?: కాల్ గర్ల్స్ని పంపిన శ్రవణ్
శిరీషపై అత్యాచారం జరగలేదు అని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె లోదుస్తులపై మరకలు ఉండటం దీనిపై అనుమానాలను పెంచింది. దీంతో పోలీసులు సైతం ఆ దిశగా విచారణ జరపగా.. అత్యాచారం జరగలేదని, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని నిందితులు వెల్లడించారు. పోలీసులు సైతం ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్ప దీనిపై స్పష్టత ఇవ్వలేమని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్టు.. అత్యాచారం జరగలేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక రిపోర్టులో స్మెర్మొటోజ కనిపించలేదని నిపుణులు పేర్కొన్నట్లు చెబుతున్నారు. మరోవైపు శిరీష కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలు అధికారికంగా వెల్లడయితే.. ఈ కేసు ఇంకే మలుపు తిరుగుతుందోనన్న దానిపై ఆసక్తి నెలకొంది.