ఫోరెన్సిక్ తేల్చింది.. శిరీషది ఆత్మహత్యే!?: కాసేపట్లో పోలీసుల ప్రెస్ మీట్!
శిరీష ఆత్మహత్యకు సంబంధించి మరికాసేపట్లో పోలీసులు మీడియా ముందుకు వచ్చే అవకాశముంది. ఫోరెన్సిక్ రిపోర్టు సహా విచారణలో తేలిన పలు విషయాలను మీడియా ద్వారా వివరించనున్నారు.
హైదరాబాద్: సంచలనం రేపిన బ్యుటిషియన్ శిరీష అనుమానాస్పద మృతిని పోలీసులు ఆత్మహత్యగా నిర్దారించారు. మృతదేహంపై పెదవులు, మెడ భాగాల్లో గాయాలున్న నేపథ్యంలో శిరీషది హత్య అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ.. ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్దారించినట్లు తెలుస్తోంది.
చున్నీతో ఉరేసుకుని చనిపోవడంతో.. మెడ మీద బలమైన ఒత్తిడి వల్లే ఆమె చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలినట్లు తెలుస్తోంది. ఎన్నో అనుమానాలకు తావిచ్చిన ఈ కేసును పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా విచారించారు. అటు శిరీషతో కుకునూరు పల్లి వెళ్లిన శ్రవణ్, రాజీవ్ లను సైతం పలు కోణాల్లో పోలీసులు విచారించారు.
ఆ రాత్రి క్వార్టర్లో ఏం జరిగింది? రెండు గంటలపాటు ఒకే గదిలో శిరీష, ప్రభాకర్ రెడ్డి?
మరోవైపు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అనుమానాస్పద మృతితో శిరీష ఆత్మహత్యకు లింకు బయటపడటంతో... ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందనన్న ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. శిరీషది ఆత్మహత్య అని పోలీసులు నిర్దారించినట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో.. ప్రభాకర్ రెడ్డి మృతికి సంబంధించిన చిక్కుముడి వీడాల్సి ఉంది.
కేసుకు సంబంధించి అంతర్గత కోణాలు బయటపడితే గానీ శిరీష ఆత్మహత్యకు అసలు కారణాలు తెలిసే అవకాశం లేదు. వివాహేతర సంబంధాలా? లేక వ్యక్తిగత గొడవలే శిరీష ఆత్మహత్యకు కారణమా? అన్నది తేలాల్సి ఉంది.
కాగా, శిరీష ఆత్మహత్యకు సంబంధించి మరికాసేపట్లో పోలీసులు మీడియా ముందుకు వచ్చే అవకాశముంది. ఫోరెన్సిక్ రిపోర్టు సహా విచారణలో తేలిన పలు విషయాలను మీడియా ద్వారా వివరించనున్నారు.