కెటిఆర్ సహా మంత్రుల్ని దానం, ఆ తర్వాత టిఆర్ఎస్ ఏజెంట్ అని సోమేష్పై ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ శుక్రవారం నాడు కలిశారు. బంజారాహిల్స్లో లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయానికి కేటాయించిన భూములను ఇస్కాన్ నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారని తెలుస్తోంది.
కాగా, దానం నాగేందర్.. మంత్రి కెటిఆర్తో పాటు ఇతర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులను కలిశారు. ఇస్కాన్ సంస్థకు కేటాయించిన ఐదెకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్నారు.
సోమేష్ టిఆర్ఎస్ ఏజెంట్: దానం
జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టిఆర్ఎస్ ఏజెంట్ అని, వారి మెప్పు కోసం ఓట్లను తొలగిస్తున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. సోమేష్ కుమార్ను తొలగించాకే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.
భన్వర్ లాల్కు ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసీ) పరిధిలో సీమాంధ్రుల ఓటర్లను తొలగిస్తూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
దాదాపు 17లక్షల మంది ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఒక్క సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోనే 31వేల మంది ఓట్లను తొలగించేందుకు మార్క్ చేసినట్లు తెలిపారు.
వార్డుల విభజన, రిజర్వేషన్ల కేటాయింపులోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన ఓటర్ల జాబితాను భన్వర్ లాల్కు అందిస్తామని భట్టి చెప్పారు. వివరాలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చిందని చెప్పారు. లక్షలాది మంది ఓట్లను తొలగిస్తున్నారన్నారు.
చట్టవిరుద్ధంగా తొలగిస్తే చర్యలు: భన్వర్ లాల్
గ్రేటర్ పరిధిలో అక్రమంగా లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈసి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై భన్వర్ లాల్ సానుకూలంగా స్పందించారు. చట్టవిరుద్ధంగా ఓట్లు తొలగించినట్లు ఆధారాలు దొరికితే.. ఎవరి పైన అయినా చర్యలు తీసుకుంటామని భన్వర్ లాల్ హామీ ఇచ్చారు.