మాజీ ఎమ్మెల్యే రత్నం ఇంట్లో చోరీ, నిద్రపోయారు..
హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేఎస్ రత్నం ఇంట్లో తెల్లవారుజామున దొంగలు పడ్డారు. బంజారాహిల్స్లోని ఆయన ఇంట్లో శుక్రవారం దొంగలు చొరబడి లక్షల విలువ చేసే సొమ్ము, బంగారం, డబ్బు దోచుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నారు.
ఆయన ఇంట్లోకి చొరబడ్డ దొంగలు మొత్తం.. రూ.36 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. ఈ సంఘటన పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్నెంబర్ 10లో నివాసం ఉండే చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం కుమార్తె డాక్టర్ ప్రవీణ శుక్రవారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో వాకింగ్కు వెళ్తూ తలుపుకు గడియపెట్టి వెళ్లింది.
ఆ సమయంలో కుటుంబ సభ్యులు వేర్వేరు గదుల్లో ఉన్నారు. వచ్చే నెల 10 ప్రవీణ వివాహం ఉండటంతో గత రెండు రోజుల నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ప్రవీణ బెడ్రూమ్లో ఉంచారు.
ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన ప్రవీణ బెడ్రూమ్లో వస్తువులు చిందర వందరగా కనిపించడంతో అలమారలో చూడగా రూ.30 లక్షల విలువ చేసే ఆభరణాలతో పాటు ఆరు లక్షల నగదు కనిపించ లేదు.
దీంతో బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని ప్రాథమిక ఆదారాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో కేఎస్ రత్నం, ఆయన చిన్న కుమార్తె, కోడలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. వీరు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని మిథిలా నగర్లో ఉంటున్నారు.