బిజెపితో కెసిఆర్ రహస్య ఎజెండా, టిడిపితో పొత్తుకు అభ్యంతరం లేదు: జైపాల్ రెడ్డి
టీడీపీతో పొత్తుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.
హైదరాబాద్: టీడీపీతో పొత్తుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. టిఆర్ఎస్, బిజెపి మినహా ఇతర పార్టీలతో తాము స్నేహాంగానే ఉంటామని ఆయన ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీతో అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొంటామని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించిన రెండు రోజులకే జైపాల్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.
తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకుగాను విపక్షాలు సన్నద్దమౌతున్నాయి. బీహార్ తరహాలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్దం చేసుకొంటున్నాయి.అయితే ఇదే తరుణంలో భావసారూప్యత ఉన్న పార్టీలు, సంస్థలు, ప్రజా సంఘాలతో కలిసి పనిచేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.
ఈ మేరకు కెసిఆర్ ను గద్దెదించేందుకు కాంగ్రెస్, టిడిపిలు కూడ కలిసి పనిచేసేందుకు సానుకూలంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చాయి.తాజాగా మాజీ కేంద్ర ఎస్ .జైపాల్ రెడ్డి టిడిపితో పొత్లుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.
టిడిపి అంటరాని పార్టీ కాదు
టిడిపి అంటరాని పార్టీ కాదని మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపిలను మినహాయించి ఏ పార్టీతోనైనా కలిసిపనిచేసేందుకు తాము సిద్దంగానే ఉంటామని జైపాల్ రెడ్డి ప్రకటించారు. టిడిపితో కూడ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారాయన. అయితే టిడిపి నిర్ణయం ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.
బిజెపితో కెసిఆర్ కు రహస్య ఎజెండా
బిజెపితో టిఆర్ఎస్ కు రహాస్య ఎజెండా ఉందని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోడీతో అనుకూలంగా ఉండడం, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు.తెలంగాణలో అమిత్ షా పర్యటన వల్ల ఏం ప్రయోజనం లేదన్నారు. కేంద్రం నుండి తెలంగాణఖకు రాజ్యాంగబద్దంగా, చట్టపరంగా రావాల్సిన నిధులు వచ్చాయన్నారు. అమిత్ షా వి కాకిలెక్కలన్నారు. కెసిఆర్ ద్వంద్వ విధానం తేటతెల్లమైందన్నారు.బిజెపితో కెసిఆర్ కు రహస్య ఎజెండా ఉందని జైపాల్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాజకీయాల్లో పెనుమార్పులు
2019 నాటికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బంగారు తెలంగాణ కోసం ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు టిఆర్ఎస్ వలవిసిరింది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్ఎస్ లో చేరారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది.దీంతో టిఆర్ఎస్ కు ఎదురులేదనే పరిస్థితి నెలకొంది.అయితే వచ్చే ఎన్నికలనాటికి విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ మేరకు కాంగ్రెస్ తో కూడ కలిసి పనిచేసేందుకు టిడిపి సమాయత్తమైంది. కాంగ్రెస్ కూడ సానుకూలంగా స్పందించింది.
బీహార్ ఫార్మూలా కలిసివచ్చేనా?
బీహార్ రాష్ట్రంలో విపక్షాల ఓటు బ్యాంకు చీలిపోకుండా నితీష్ నేతృత్వంలో మహాకూటమిని ఏర్పాటుచేసి పోటీచేశారు.దీంతో నితీష్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే అదే ఫార్మూలాను తెలంగాణలో కూడ అమలుచేయాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కోదండరామ్, పవన్ కళ్యాణ్, గద్దర్ లతో కలిసి ప్రత్యామ్నాయరాజకీయవేదిక ఏర్పాటుకు సిపిఎం ప్రయత్నాలు చేస్తోంది.టిడిపి కూడ ఈ తరహా ప్రత్యామ్నాయ వేదికకు అనుకూలంగా సంకేతాలను ఇచ్చింది.అయితే ప్రత్యామ్నాయ కూటమికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.