దేశంలోనే తెలంగాణ వినూత్నంగా.. మహిళా ఖైదీలకు పెట్రోల్ బంక్
చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించిన 25 మంది మాజీ మహిళా నేరస్తులు ఇక నుంచి పెట్రోల్ బంక్ నడపనున్నారు. వారికి నెలకు రూ.12 వేల వేతనం రానుంది.
హైదరాబాద్: చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించిన 25 మంది మాజీ మహిళా నేరస్తులు ఇక నుంచి పెట్రోల్ బంక్ నడపనున్నారు. వారికి నెలకు రూ.12 వేల వేతనం రానుంది.
మహా పరివర్తన పేరుతో జైళ్లలో సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్ బంక్ను శుక్రవారం ప్రారంభించింది.
చంచల్గూడ్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటుతో విడుదలైన మహిళా ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నారు.
జైలు నుంచి బయటకు వెళ్లిన ఖైదీలు గౌరవంగా జీవించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పెట్రోల్ బంక్ల నిర్వహణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
అధికారుల పర్యవేక్షణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు వీటిల్లో పని చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం ఇండియన్ ఆయిల్ కంపెనీ భాగస్వామ్యంలో చంచల్గూడ జైల్లో ప్రయోగాత్మకంగా పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల ప్రాంగణాలు, ఇతర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు.