'అమరావతికి శంషాబాద్ ఏయిర్పోర్ట్ ఉపయోగిస్తాం!', కెసిఆర్ సహా 15వేలమంది విఐపీలు
గుంటూరు/ఖమ్మం: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన దసరా పర్వదినం రోజు జరగనుంది. శంకుస్థాపన వేడుకలు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సిఎంలు, గవర్నర్లను ఏపీ ఆహ్వానించింది. విఐపీల రద్దీ దృష్ట్యా అవసరమైతే శంషాబాద్ విమానాశ్రయాన్ని ఉపయోగించుకోనున్నారు.
ఏపీ మంత్రి నారాయణ శుక్రవారం మాట్లాడారు. ప్రముఖుల రాక కోసం తిరుపతి, గన్నవరం తదితర విమానాశ్రయాలను ఉపయోగించుకుంటామని చెప్పారు. అవసరమైతే శంషాబాద్ విమానాశ్రయం ఉపయోగించుకుంటామన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
కెసిఆర్ సహా అందరికీ ఆహ్వానం
ఏపీ రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల గవర్నర్లకు ఆహ్వానం అందనుంది. దాదాపు 15,000 విఐపీలను ఆహ్వానించనున్నారు. రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు, హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకే భరోసా
రైతు ఆత్మహత్యల విషయంలో ప్రభుతానికి కనువిప్పు కల్గించేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటలు పండే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పిన టిఆర్ఎస్, అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామననడం విడ్డూరమన్నారు.
సకాలంలో రుణాలు అందక, అప్పులు తీర్చే దారిలేక, రబీపంటకు పెట్టుబడులు పెట్టలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏకకాలంలోనే రైతుల రుణాన్ని మాఫీ చేయాలన్నారు.
2019లో అధికారం కాంగ్రెస్ పార్టీదే: యాష్కీ
2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం వెలగబెడుతున్నవారంతా జైలుపాలు కాక తప్పదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి కబుర్లతో దొంగ రాజకీయం చేస్తున్నారన్నారు.
రైతు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని అసెంబ్లీలో అడిగిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి రైతులంటే చులకన అని, వారికి మేలు చేయడం కేసీఆర్ కి ఇష్టం లేదన్నారు. రేపు విపక్షాలు పిలుపునిచ్చిన బంద్ను తెలంగాణ ప్రజలు విజయవంతం చేయాలన్నారు. లేదంటే గడీల రాజ్యం వస్తుందన్నారు.
ఆత్మహత్యలు కనిపించడం లేదా: ఎర్రబెల్లి
శనివారం నాటి బందును ప్రజలంతా విజయవంతం చేయాలని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు విజ్ఞప్తి చేశారు. రైతులకు మద్దతునివ్వాలంటే రేపటి బంద్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనపడడం లేదా అని నిలదీశారు.
శాసనసభలో నిలదీసినందుకు విపక్షాలను సస్పెండ్ చేశారన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలన్నారు. రైతులకు మద్దతుధర కల్పించాలన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రేపటి బంద్ ఒక మార్గమన్నారు.