ఉద్యోగాలిప్పిస్తామని టోకరా: చక్రపాణి ఫిర్యాదుతో నలుగురి అరెస్టు (ఫొటోలు)
హైదరాబాద్: రవాణా శాఖలో ఆసిస్టింట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.16 లక్షలు మింగిన నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15.88 లక్షలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మీడియాతో ప్రతినిధులతో చెప్పారు.
కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పామర్తి శ్రీనివాసరావుకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఎంవీఐ రాతపరీక్షలో తక్కువ మార్కులొచ్చాయి. అయినా అవకాశం ఉంటుందనే ఆశతో ఆరునెలల కిందట హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్లో ఉంటున్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను కలిశాడు.
అక్కడి నుంచి వస్తుండగా బేగంపేటలోని రాజీవ్గాంధీ ఏవియేషన్ అకాడమీలో డ్రైవర్, కృష్ణా జిల్లా కలిదిండి మండలం సంతోష్పురానికి చెందిన తిరుమలరాజు ఎదురుపడ్డాడు. ఇద్దరూ ఒకే జిల్లావారు కావడంతో మాట్లాడుకున్నారు. టీఎస్పీఎస్సీలోని కంప్యూటర్ విభాగంలో తెలిసినవారున్నారని, డబ్బులిస్తే పనవుతుందని తిరుమలరాజు చెప్పాడు.
మహమూద్ అలీ, మీర్ కరార్లను తిరుమలరాజు కలవగా రూ.31 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని వారు చెప్పారు. అతను శ్రీనివాసరావుకు ఫోన్ చేసి రూ.40 లక్షలివ్వాలని, ముందు రూ.20 లక్షలు, ఆపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత మరో రూ.20 లక్షలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
శ్రీనివాసరావు గత డిసెంబరులో రూ.10 లక్షలు ఇచ్చాడు. తరువాత మీర్కరార్, అలీ స్పందించడం లేదంటూ చెప్పడంతో తిరుమలరాజు తన ఇంటిపక్కనుండే యాకూబ్అలీని టీఎస్పీఎస్సీ కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న కోటేశ్వరరావుగా పరిచయం చేశాడు. ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో తన నెంబరు లేకపోవడంతో శ్రీనివాసరావు వారిని కలిశాడు.
మార్కులు వేయాలంటే మరో ముగ్గురికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని యాకుబ్అలీ చెప్పడంతో మరో రూ.5.88 లక్షలు ఇచ్చాడు. ఈ నెల 13న విడుదల చేసిన రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో శ్రీనివాసరావు టీఎస్పీఎస్సీ అధికారులకు సమాచారమిచ్చాడు.
టిఎస్పిఎఎస్సి ఛైర్మన్ చక్రపాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజావెంకటరెడ్డి బృందం నిందితులు ఎం.తిరుపతయ్య, షేక్ యాకుబ్అలీ, మహమూద్ అలీ, మీర్ కరార్లను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది.