రాఖీ కట్టి తిరిగొస్తుండగా.. యువతిపై గ్యాంగ్ రేప్
కొల్లాపూర్ : అన్నకు రాఖీ కట్టడానికెళ్లిన ఓ యువతి.. ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో గ్యాంగ్ రేప్ కు గురైంది. ఆపై తీవ్ర మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికల్ల గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
కుడికల్ల గ్రామానికి చెందిన హర్షిణి అనే యువతి.. రాఖీ పండగ సందర్బంగా.. హైదరాబాద్ లో ఉన్న తన అన్నకు రాఖీ కట్టడానికి వెళ్లింది. తిరిగి ఇంటికొస్తున్న క్రమంలో.. బాగా చీకటి పడడంతో ఇంటికెళ్లడానికి ఆటోలేమి దొరకలేదు. ఏదైనా వాహనం వస్తుందోమోనని ఎదురుచూస్తోన్న ఆమెకు గ్రామానికే చెందిన కొంతమంది యువకులు తారసపడ్డారు.
తాము గ్రామానికే వెళుతున్నామని, తమతో పాటు వస్తే తీసుకెళుతామని చెప్పడంతో.. వాళ్ల మాటలు నమ్మి బైక్ పై ఎక్కింది హర్షిణి. అయితే మార్గమధ్యలోనే ముగ్గరు యువకులు హర్షిణిపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హర్షిణి.. మరుసటి రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులంతా ఆందోళన బాట పట్టడంతో.. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.