రేవంత్ ఓ పెంపుడు కుక్క, కనుసైగ చేస్తే..: గంగుల
కరీంనగర్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి ఆర్అండ్బీ అతిథిగృహాంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రేవంత్రెడ్డీ.. మా పార్టీ ప్రతినిధులపై, ఎమ్మెల్యేలు, మంత్రులు, సిఎం కెసిర్పై నిరాధారమైన ఆరోపణలను చేస్తూ పిచ్చికుక్కలా మొరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి' అని హెచ్చరించారు.
ఎంగిలి మెతుకులకు ఆశపడి, సమైక్యవాది ముసుగులో పసలేని ఆరోపణలు చేసి ప్రశాంతంగా ఉన్న వాతావారణాన్ని చెడగొట్టొద్దని ధ్వజమెత్తారు. ‘ఇన్నాళ్లు నీ పిచ్చి ప్రేలాపనలు భరించాం. మారుతావని అశించాం. నీ వ్యవహారం శృతిమించుతోంది. అందుకే తేల్చి చెబుతున్నాం. ఇకపై ఎక్కడైనా పిచ్చికుక్కలా మొరిగినా, అసందర్భ ఆరోపణలు చేసినా జరిగే పరిణామాలకు బాధ్యత నీదే' అని చెప్పారు.
ఓ నాయకుడి మెప్పుకోసం పెంపుడుకుక్కలా మారి సింహాన్ని అనుకుంటున్నావని రేవంత్పై మండిపడ్డారు. తాము కనుసైగ చేస్తే మాడిమసైపోతావని గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గనులశాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, అందులో తమ పాత్ర ఉందని, మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీయగా మారిందని, గ్రానైట్లారీల ఓవర్లోడ్ నివారణకు ఏర్పాటుచేసిన చెక్పోస్టులను సిఎం కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఎత్తివేయించామని నిరాధారమైన ఆరోపణలు చేస్తావా? అంటూ మండిపడ్డారు.
‘అత్మవిమర్శ చేసుకో, కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారం చేయాలని నువ్వు ప్రయత్నిచలేదా? అవకాశంరాక మాపై ఆరోపణలు చేస్తావా? ఓవర్లోడ్ వద్దని మేమే చెబుతున్నాం.' అని అన్నారు. గ్రానైట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తే భయపడి కమీషన్లు ఇస్తారని అశిస్తున్నావా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో బినామీపేర్లతో నిబంధనలకు విరుద్ధంగా రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి అడ్డదారిలో సంపాదించింది నువ్వు కాదా? ఫ్లెక్సీల దుకాణంతో మొదలైన నీ బతుకును బ్లాక్మెయిలింగ్ రాజకీయాల వైపు మళ్లించి కోట్లు గడించింది చాల్లేదా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.