టిఎస్పిఎస్సీ తొలి చైర్మన్గా ఘంటా చక్రపాణి(ఫొటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ప్రస్తుతానికి కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘ నేత విఠల్, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోతు చంద్రావతిలను నియమించారు. వీరి నియామకంపై జీవో 169ను ప్రభుత్వం బుధవారం రాత్రి జారీ చేసింది.
కమిషన్ ఏర్పాటులో కీలకమైన కార్యదర్శి నియామకాన్ని ప్రభుత్వం మంగళవారమే పూర్తి చేసింది. స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన సీనియర్ అధికారి సుందర్ అబ్నార్ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా మంగళవారం నియమించగా, ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
కమిషన్ సభ్యులు రెండేళ్లటు పదవుల్లో కొనసాగుతారు. గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ చైర్మన్గా గంటా చక్రపాణి బాధ్యతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉద్యోగాల భర్తిలో పూర్తి పారదర్శకత చూపిస్తామని ఆయన తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీ అవినీతికి అడ్డాగా ఉండేదని తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా, నిజాయితీ అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు.
తనకు చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి ఉస్మానియా విద్యార్థులు, ఇతర యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నా చేయాల్సిన అవసరం రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగాల భర్తికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేస్తామని తెలిపారు. 2015 సంవత్సరాన్ని ఉద్యోగాల భర్తీ సంవత్సరంగా గుర్తిస్తామని, ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపడతామని పేర్కొన్నారు.
కాగా, టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఘంటా చక్రపాణిని నియమించడంపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి సంతోషం వెలిబుచ్చారు. కమిషన్ ఏర్పాటు, చైర్మన్, సభ్యుల ఎంపికపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.