'స్వతంత్రం'గా చుక్కలు చూపించారు!: టిడిపికి బిజెపి రాంరాం చెప్పేనా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుదేలయింది. టిఆర్ఎస్ ఇచ్చిన హామీలతో పాటు, స్వీయ వైఫల్యాలు కూడా టిడిపిని దెబ్బతీశాయని అంటున్నారు. మిత్రపక్షం బిజెపితో సమన్వయలోపం కనిపించిందని అంటున్నారు. సీట్ల కేటాయింపులోని తప్పిదాలు జరిగాయంటున్నారు.
అలాగే, పార్టీ నుంచి చాలామంది కీలక నేతలు వెళ్లిపోవడం బాగా నష్టపరిచిందంటున్నారు. గతంలో భాగ్యనగరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, నగరం వెలుపల తీగల కృష్ణా రెడ్డి తదితరులు టిడిపి తరఫున చక్రం తిప్పేవారు. ఇప్పుడు వారు టిఆర్ఎస్లో ఉన్నారు.
వీరితో పాటు కారు ఎక్కిన ఇతర నేతల వల్ల కూడా దెబ్బతిన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. టిఆర్ఎస్ ప్రచారం ముందు టిడిపి ప్రచారం తేలిపోయింది. తొలి నుంచి కెసిఆర్, కెటిఆర్ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై వాడివేడి విమర్శలు చేశారు.
చంద్రబాబు ప్రచారం చేసినా అంత ప్రభావం కనిపించలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే కెటిఆర్ నగరమంతా కలియ తిరిగారు. టిక్కెట్ల కేటాయింపు తర్వాత అసంతృప్తులను బుజ్జగించడంలో టిఆర్ఎస్ సఫలమైతే, టిడిపి పూర్తిగా విఫలమైంది. బిజెపితో సమన్వయలోపం కనిపించింది.
గంపగుత్తగా..
ముఖ్యంగా గత ఎన్నికల్లో టిడిపికి అండాగ నిలిచిన సెటిలర్ల ఓట్లు ఈసారి గంపగుత్తగా టిఆర్ఎస్కు పడేలా మంత్రి కెటిఆర్ చేయగలిగారు. ఆ స్థాయిలో టిడిపి నేతలు ఆకట్టుకోలేకపోయారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు.
బిజెపి - టిడిపి కూటమి శ్రేణులు విభేదాలు మరిచి కలిసికట్టుగా నడుచుకునేలా చేయలేకపోయారని అంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు ఒకటి రెండు నెలల ముందు నుంచే దృష్టి పెడతారు. గ్రేటర్ ఎన్నికల పైన మాత్రం ఆయన దృష్టి పెద్దగా పెట్టలేదు. రెండు రోజులు ప్రచారం చేసి వెళ్లిపోయారు.
టిడిపికి బిజెపి కటీఫ్ చెబుతుందా?
తెలంగాణలో టిడిపికి చోటు లేదు.. అని టిఆర్ఎస్ ఎప్పుడూ చెబుతుంది. బిజెపి నేతలు బయటకు చెప్పకపోయినా.. టిడిపితో పొత్తు తమకు నష్టమని భావిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే టిడిపితో పొత్తుకు బిజెపి తెలంగాణ నేతలు నో చెబితే... అధిష్టానం కలిసి ముందుకెళ్లాలని సూచించింది.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి గట్టి షాక్ తగిలింది. టిడిపితో పొత్తు వల్ల బిజెపి గెలవాల్సిన సీట్లు కూడా కోల్పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు వారు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. హైదరాబాదులో అయిదుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారు.
టిడిపితో పొత్తు వల్లనే కనీసం ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతంలోని ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబర్ పేట నియోజకవర్గంలో ఒక్క డివిజన్ కూడా దక్కలేదు.
టిడిపితో పొత్తు వల్లే చాలా నష్టపోయామని, లేకుంటే పదికి పైగా సీట్లు గెలిచేవారమని బిజెపి నాయకులు లోలోన మదనపడుతున్నారు. ఇప్పుడైనా అధిష్టానం తెలంగాణలో టిడిపితో పొత్తుపై పునరాలోచన చేయాలని వారు కోరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు... గ్రేటర్ ఎన్నికల్లో ముషీరాబాద్ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుప్రియా నవీన్ గౌడ్ ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. ఆమె టిఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. సుప్రియా మొదటి నుంచి బిజెపి నుంచి టిక్కెట్ను ఆశించారు.
అయితే, పొత్తులో భాగంగా ఈ డివిజన్ను టిడిపికి కేటాయించారు. దీంతో సుప్రియాను కప్పు సాసర్ గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించారు. చివరి వరకు పోరాడి ఆమె ఓడిపోయారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమె గెలిచే వారనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది.
ఇక్కడ టిఆర్ఎస్ నుంచి గెలిచిన భాగ్యలక్ష్మికి పదివేలపై చిలుకు ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సుప్రియకు ఆరువేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్థి సరితకు 2వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి ఎమ్మెల్యే (డాక్టర్ కె లక్ష్మణ్) ఉన్నారు.
సుప్రియ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమెకు బిజెపి మద్దతు పలికింది. ఆమెకు వచ్చిన ఓట్లు, టిడిపికి వచ్చిన ఓట్లు దాదాపు పదివేలు ఉన్నాయి. టిఆర్ఎస్ అభ్యర్థి పదివేల ఓట్లు సాధించారు. అదే సుప్రియ బిజెపి తరఫున పోటీ చేసి ఉంటే.. అందరికి సుపరిచతం అయిన పువ్వు గుర్తుతో సులభంగా గెలిచేవారని అభిప్రాయపడుతున్నారు. పలుచోట్ల ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు.