హైద్రాబాద్లో 'ఆపరేషన్ సీమాంధ్ర': టీడీపీకి బీజేపీ ఝలక్, పవన్ చక్రం తిప్పేనా?
హైదరాబాద్: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఆపరేషన్ సీమాంధ్రను ప్రారంభించాయి! హైదరాబాద్లో సీమాంధ్రకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు.
దీంతో, వారిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తోన్నాయి. తమ ఏడాది పాలనలో ఆంధ్రా ప్రజలు హైదరాబాదులో ప్రశాంతంగా జీవిస్తున్నారని టీఆర్ఎస్ చెబుతుంటే, తమ పాలనలోనే బాగున్నారని కాంగ్రెస్ అంటోంది.
హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు తమకే ఓటు వేస్తారని టీడీపీ, బీజేపీలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న గ్రేటర్ ఎన్నికలు గతంలో కంటే రసవత్తరంగా మారనున్నాయి. అయితే, ఎవరెవరు కలిసి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలు పొత్తు పెట్టుకున్నాయి. అయితే, తెలంగాణ బీజేపీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోవడం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరు కలిసి పోటీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ తీరు చూస్తుంటే పొత్తు కుదరకపోవచ్చుననిపిస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ కూటమికి మద్దతు పలికిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది ఇంకా అనుమానమే. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆయన రాజకీయాల పైన దృష్టి సారించలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవచ్చంటున్నారు.
అయితే, టీడీపీ - బీజేపీ కూటమిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మద్దతిస్తారా? వేరుగా పోటీ చేస్తే బీజేపీకే మద్దతు పలుకుతారా? అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనుంది. టీఆర్ఎస్ - మజ్లిస్ పార్టీలో దోస్తీ కట్టనున్నాయి.
పొత్తుల విషయం ఏదైనా, ప్రస్తుతం పార్టీలన్నీ ఆపరేషన్ సీమాంధ్ర అంటున్నాయి. నగరంలో ఎక్కువమంది వారు ఉండటంతో వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ను కొందరు సీమాంధ్ర వ్యతిరేకిగా భావిస్తారు. ఆ పార్టీ కూడా సీమాంధ్రుల ఓట్ల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
సెక్షన్ 8 తెరపైకి వచ్చాక టీఆర్ఎస్.. సీమాంధ్రులకు తమ పాలనలో ఎలాంటి ఇబ్బంది లేదని బల్లగుద్ది మరీ చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదిగా సీమాంధ్రులకు ఇబ్బందులు లేవని, ఎవరి పైనా దాడులు జరగలేదని అధికార పార్టీ చెబుతోంది.
గ్రేటర్ ఎన్నికల వ్యూహంతో, సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలకు పార్టీలో చోటు కల్పించారు. జయసుధను కూడా చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఇదంతా సీమాంధ్ర ఓటర్ల కోసమేనని చెబుతున్నారు.
మరోవైపు విపక్షాలు కూడా సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, సీమాంధ్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు గతాన్ని చెబుతున్నారు. నగరంలో బీజేపీ - టీడీపీలకు మంచి పట్టు ఉంది. దీంతో ఆ పార్టీలు గట్టి విశ్వాసంతో ఉన్నాయి.
సెక్షన్ 8 డిమాండ్ చేయాలన్న టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది. టీఆర్ఎస్ పాలనలో సీమాంధ్రులకు చిక్కులు మాత్రం ఉంటాయని వారు చెబుతున్నారు. గతంలో కొందరి ఇళ్లు కూలగొట్టారని, చంద్రబాబుకు ఇంటి అనుమతి ఇవ్వలేదని, ఇటీవలే జేఎన్టీయూ ప్రొఫెసర్ పైన దాడి జరిగిందని గుర్తు చేస్తున్నారు.
సెక్షన్ 8 అమలు జరిపితేనే భద్రత ఉంటుందని చెబుతున్నారు. దీంతో, పాటు ఏపీ స్థానికత కలిగిన 1400 మంది విద్యుత్ ఉద్యోగులను హఠాత్తుగా రిలీవ్ చేయడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటప్పుడు భద్రత గురించి ఎలా చెబుతారని అంటున్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులు తమవాళ్లేనని టీఆర్ఎస్ చెబుతోంది.