100 ప్రాంతాల్లో రూ.5కే భోజనం.. సంఖ్య పెంచిన జీహెచ్ఎంసీ.. త్వరలో మరో 50 కేంద్రాలు
హైదరాబాద్ నగరంలో రెండు రోజుల్లో.. 27 ప్రాంతాలలో రూ.5కే భోజన కేంద్రాలను ప్రారంభించారు. దీంతో ఈ భోజన కేంద్రాల సంఖ్య 100కు చేరింది.
హైదరాబాద్: నగరంలో రెండు రోజుల్లో.. 27 ప్రాంతాలలో రూ.5కే భోజన కేంద్రాలను ప్రారంభించారు. దీంతో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన భోజన కేంద్రాల సంఖ్య 100కు చేరింది.
డివిజన్ కు ఒకటి చొప్పున 150 కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలో సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ భోజన కేంద్రాల సంఖ్యను తాజాగా 100కు చేర్చింది జీహెచ్ఎంసీ.
శుక్రవారం ఏకంగా 16 ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. హరేకృష్ణ మిషన్ సహకారంతో నగరంలో తక్కువ ధరకు జీహెచ్ఎంసీ భోజనం సమకూరుస్తోంది. ఈ భోజన కేంద్రాల ఏర్పాటుతో కార్మికులు, నిరుపేదలు రూ.5కే కడుపునిండా భోజనం చేసే అవకాశం కలిగింది.
త్వరలోనే మరో 50 భోజన కేంద్రాలను ప్రారంభిస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఒక్కో కేంద్రం వద్ద 300 మందికి ఆహారం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు ఈ భోజన కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన తెరమీదికి రాగా... అప్పటినుంచి విడతల వారీగా భోజన కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. ఒక్కో ప్లేట్ భోజనానికి జీహెచ్ఎంసీ రూ.19.25 చెల్లిస్తుండగా, పౌరుల నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. మిగిలిన వ్యయమంతా హరేకృష్ణ మిషన్ భరిస్తోంది.