ఎక్కువొద్దు: పవర్ ప్లాన్, వాటర్ గ్రిడ్పై కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ సిద్ధమైంది. హోర్డింగులు, హోటల్ యాజమాన్యాలు తదితరాలు అదనపు విద్యుత్ వాడకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే హోర్డింగ్స్ వాడాలని సూచించారు.
అధిక విద్యుత్ వాడకూడదని తెలిపారు. డెకరేషన్కు ఎక్కువ లైటింగ్ ఉపయోగించవద్దని పేర్కొన్నారు. వీధి లైట్ల బదులుగా ఎల్ఈడీ లైట్లు వాడితే విద్యుత్ పొదుపు చేయవచ్చునని సూచించారు. ఖరీఫ్ రైతుల కోసం 15 రోజుల పాటు విద్యుత్ ఆదా ప్రయత్నాలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
కేసీఆర్తో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ భేటీ
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్ సోమవారం సమావేశమయ్యారు. మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీశైలం, సాగర్ జల విద్యుత్పత్తిపై తలెత్తిన వివాదాలు, బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖలు గురించి చర్చించారు. ఇంకా తెలంగాణకు 54 శాతం విద్యుత్ వాటి, ప్రస్తుత అవసరాలు, గతంలో ఇచ్చిన జీవోలు, వాటి అమలు అంశంపైన కీలక చర్చ జరిగినట్లుగా తెలస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్
అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం చెప్పారు. వాటర్ గ్రిడ్ పైన కేటీఆర్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో పాన్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పేరు ప్రతిష్టలున్న కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ నుండి అంతా పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రభుత్వమే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు.
మద్యం సిండికేట్లపై హైకోర్టులో విచారణ
మద్యం సిండికేట్లపై రెండు వారాల్లోగా ప్రాసిక్యూషన్ పూర్తి చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం మద్యం సిండికేట్ల వ్యవహారంలో గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులను విచారించేందుకు ప్రభుత్వం అనుమతిస్తే దర్యాప్తు ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా కోర్టుకు ఏసీబీ తెలిపింది.