సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం: మృతిపై అనుమానాలు, అఘాయిత్యం జరిగిందా...
హైదరాబాదులో ఓ యువతి మరణం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రమాదంలో మరణించినట్లు అనిపించినా పరిస్థితులు అనుమానాలకు కారణమవుతున్నాయి.
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు భావిస్తున్నప్పటికీ ఓ యువతి మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిందా, ఎవరైనా హత్య చేశారా అనే ప్రశ్నలు ఉదయిస్తన్నాయి. ప్రమాదంలో మరణించినట్లు భావిస్తే, ఆమె ఎన్నడూ వెళ్లని మార్గంలో ఎందుకు వెళ్లింది, చెప్పులు దూరంగా వేసిరేినట్లుగా శవానికి దూరంగా ఎందుకు పడి ఉన్నాయనే సందేహాలు కలుగుతున్నాయి.
పోలీసులు మాత్రం ప్రాథమిక దర్యాప్తులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతోనే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు తల, నడుముకు బలమైన గాయాలు కావడంతోనే కావ్యశ్రీ అక్కడికక్కడే మృతిచెందినట్లు భావిస్తున్నట్లు హైదరాబాదులోని లంగర్హౌజ్ ఇనస్పెక్టర్ ఎం.ఎ.జావీద్ తెలిపారు.
అయితే ఆమె చెప్పులు దూరంగా పడివుండటంపై అనుమానం ఉందని, దర్యాప్తు తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు తెలుస్తాయని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు కూడా ఇది రోడ్డు ప్రమాదమేనని నిర్ధారించినట్లు చెప్పారు. యువతి వంతెనపైకి రావటం వెనుక కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
గచ్చిబౌలి డీఎల్ఎఫ్ యునీసెస్ సాఫ్ట్వేర్ సంస్థ సెక్యూరిటీ విభాగంలో కావ్యశ్రీ(23) అనే యువతి పనిచేస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కావ్యశ్రీ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చింది. తండ్రి దూరం కావడంతో తల్లి పోషణ భారం ఆమెపైనే పడింది. వారు అత్తాపూర్ తేజస్వీనగర్లో నివాసం ఉంటున్నారు.
రోజు మాదిరిగానే కార్యాలయానికి వెళ్లేందుకు కావ్యశ్రీ సోమవారం ఉదయం 5.30 ప్రాంతంలో ఇంటి నుంచి గచ్చిబౌలి ఆఫీసుకు బయల్దేరింది. 6.30 గంటల సమయంలో కావ్యశ్రీ పిల్లర్ నంబర్ 76 పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే లక్ష్మీనగర్ వంతెనపై రక్తపు మడుగులో పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. యువతి తల, నడుము ప్రాంతాల్లో బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. కాగా అత్తాపూర్ నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు లక్ష్మీనగర్, రేతిబౌలి చౌరస్తా మార్గాల గుండా వెళుతుంటారు. కావ్యశ్రీ కూడా రోజూ అదే మార్గం ద్వారా ఆఫీసుకు వెళుతుందని మృతురాలి స్నేహితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో కావ్యశ్రీ వంతనెపైకి ఎందుకు వచ్చినట్లు అనేది అంతుబట్టడం లేదు. వాహనం ఢీకొట్టి ఉంటే శవాన్ని ఈడ్చుకెళ్లినట్లు గుర్తులైనా కనిపించాలి. అక్కడ అటువంటి ఆనవాళ్లు కనిపించకపోవటం, మృతురాని చెప్పులు ఘటనాస్థలికి వంద మీటర్ల దూరంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
కాగా, ఆఫీసుకు బయల్దేరిన యువతిని కారులోకి ఎక్కించుకున్న అగంతకులు దారుణానికి ఒడిగట్టారా, తెలిసినవారు ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవటంతో ఘటనకు సంబంధించిన వివరాలు రికార్డు కాలేదని తెలుస్తోంది.