యువతి కిడ్నాప్కు యువకుల యత్నం: బైక్పై నుంచి దూకేసింది
పెద్దపల్లి: అనుకోకుండా ఫోన్లో పరిచయమైన యువకుడు ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి బైక్పై నుంచి దూకి తప్పించుకుంది. పెద్దపల్లిలోని శాంతినగర్లో ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ గర్రెపల్లికి చెందిన 18ఏళ్ల యువతికి పెద్దపల్లికి చెందిన సాయికుమార్ ఫోన్లో నాలుగు రోజుల క్రితం పరిచయమయ్యాడు. దీంతో వీరిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.
శుక్రవారం ఉదయం సాయికుమార్ మరోసారి యువతికి ఫోన్ చేసి పెద్దపల్లికి రావాలని చెప్పాడు. లేదంటే తనతో ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణలు రికార్డు చేశానని, మీ ఊరిలో ప్రచారం చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భయపడిన యువతి.. అక్క కొడుకుతో పెద్దపల్లికి వచ్చింది. అతడ్ని బస్టాండ్ వద్ద ఉంచి అక్కడికి వచ్చిన సాయికుమార్ బైక్పై ఎక్కింది.
బైక్పై శాంతినగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న క్రమంలో సాయికుమార్ మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వారు వెంటాడుతున్న విషయాన్ని గమనించిన యువతి బైక్పై నుంచి దూకేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు కాగా, యువకుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన యువతి.. ఇంటికి వెళ్లిపోయింది. కాగా, ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే ఆస్పత్రికి కానిస్టేబుల్ను పంపించామని, అప్పటికి ఆస్పత్రిలో ఆ యువతి లేదని, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఫిర్యాదు అందితే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.