తోటి ఉద్యోగి, అతని మిత్రుడు మత్తు ఇచ్చి యువతిపై రేప్
తనకు మత్తు మందు ఇచ్చి సహోద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం
హైదరాబాద్: తన సహోద్యోగి, అతని స్నేహితుడు తనకు మత్తు మందు ఇచ్చి ఆత్యాచారం చేశారంటూ ఓ యువతి ఆరు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో ఆమె ఈ ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి ప్రశాంత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసించే యువతి(22) ఓ సంస్థలో పని చేస్తోంది.
ఆ సంస్థలోనే పనిచేస్తున్న ఘట్కేసర్ గాంధీనగర్కు చెందిన సతీష్ ఆమెతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. 2016 జూన్ 29న యువతిని వరంగల్ జాతీయ రహదారి ఘట్కేసర్ సమీపంలో ఉన్న రెస్టారెంట్లోని ఓ గదిలోకి భోజనం కోసం తీసుకెళ్ళినట్లు తెలిపింది. భోజనం చేసిన తరవాత తాను మత్తులోకి వెళ్ళినట్లు ఆమె చెప్పింది.
సతీష్తో పాటు అతని స్నేహితుడు జావీద్ తనపై పలుమర్లు ఆత్యాచారం చేశారని ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని వారు తనకు స్వయంగా చెప్పారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు ఆమె చెప్పింది.
భయంతో ఇంత కాలం తాను పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయినట్లు తెలిపింది. ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.