‘మా సార్కు అమ్మాయంటే ఆటబొమ్మే’: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి కళాశాల లెక్చరర్ వేధింపులే కారణమన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ మండలం అక్కలాయిగూడెంకు చెందిన కొమ్మనబోయిన భవాని(16) కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది.
కాగా, ఆమె సెప్టెంబర్ 1న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్పాలడింది. కారణాలు తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు. భవాని మేకప్బాక్సులో గురువారం సూసైడ్ లెటర్ను గమనించారు.
ఆ లేఖతో లెక్చరర్ శ్రీనివాస్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. ‘అమ్మా, నాన్న, చెల్లి మీరు సంతోషంగా ఉండాలి. ఆడపిల్ల బయటకు వెళ్లి క్లాస్మేట్తో, అన్నయ్యతో మాట్లాడినా ఈ లోకం వేరేలా అర్థం చేసుకుంటుంది. ఆడపిల్ల బతకడం కష్టం. ఈ లోకం మారాలి' అని లేఖలో భవాని పేర్కొంది.
‘మా కాలేజీలో శ్రీనివాస్ సార్ మంచోడు కాదు. అమ్మాయి అంటే బొమ్మ అని అనుకుంటారు. నేను చనిపోయిన టైం 1 పీఎం' అని లేఖలో లేఖలో తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రాగానే కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు గురువారం కళాశాల వద్ద ఆందోళనకు దిగాయి.
విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్ను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. భవానీ తండ్రి సూరయ్య ఫిర్యాదు మేరకు లెక్చరర్ శ్రీనివాస్పై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
కరీంనగర్: రామగుండం మండలం ఈసాలతక్కళ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడికి గురువారం దేహశుద్ధి చేశారు. గత కొన్ని రోజులుగా విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఉపాధ్యాయుడిని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈసాలతక్కళ్లపల్లి జి ల్లాపరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆవుల రాజయ్య(42) విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. కమాన్పూర్ మండలం పెంచికలపేటకు చెందిన ఆవుల రాజయ్య ఐదేళ్లుగా పాఠశాలలో పని చేస్తున్నాడు.
గ్రామంలో అనేకసార్లు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని వేధించడంతో ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.