గూగుల్ టు గ్రేటర్ కార్పోరేటర్గా రికార్డు విజయం: ఎవరీ సామల హేమ
హైదరాబాద్: ఇటీవల ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ సృష్టించిన ప్రభంజనంలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. కార్పోరేట్ ఉద్యోగులు సైతం కార్పోరేటర్లుగా మారిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి సామల హేమ రికార్డు సృష్టించారు.
ఎంబీఏ చదివిన హేమకు గూగుల్లో ఏడు నెలల క్రితం గూగుల్లో ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు జెన్పాక్ట్లో ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీజస్ కాలేజ్లో ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అమ్మ, నాన్న, అన్నయ్య ఇదే ఆమె జీవితం. కానీ గ్రేటర్ ఎన్నికల ఆమె జీవితాన్నే మార్చేశాయి.
తాజాగా గూగుల్లో చేస్తూ టీమ్లీడర్గా ప్రమోషన్ వచ్చే టైమ్లోనే ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. కార్పోరేట్ జాబ్... ఐదంకెల జీతం వదులుకుని కార్పొరేటర్ ఎన్నికల బరిలో నిలిచింది. తండ్రి కరాటే రాజు సీతాఫల్ మండే ఏరియాలో పేరున్న రాజకీయ నాయకుడు. టీఆర్ఎస్లో క్రియాశీలకంగా ఉంటూ కార్పొరేట్ సీటు కూడా వస్తుందని ధీమాతో ఉన్నారు.
సీతాఫల్మండే టిక్కెట్ విషయమై మంత్రి పద్మారావుతో చర్చించేందుకు వెళ్లిన కరేటే రాజు వెంటనే హేమ బయోడేటా తీసుకురా అంటూ కొడుకును ఇంటికి పంపించారు. అప్పటి వరకు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు ఆమెకు తెలియదు. కార్పోరేటర్గా ఎన్నికల బరిలో నువ్వు నిలబడపోతున్నావని చెప్పగానే హేమ షాక్కు గురైంది.
ముందు కాస్త భయపడినా గెలుస్తాననే ధీమాతో ముందుకు వెళ్లారు. యూఎస్లో ఎమ్మెస్ చేద్దామన్న ఆలోచనతో గూగుల్ ఉద్యోగానికి లాంగ్లీవ్ పెట్టింది. కానీ ఈ గ్యాప్లోనే ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం రావడం, కార్పొరేటర్గా పోటీచేసి, చూస్తుండగానే చరిత్రాత్మక విజయం సాధించడం అంతా చకచకా జరిగిపోయింది.
ఈ సందర్భంగా సామల హేమ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ గారిని కలవడానికి వెళ్లినప్పుడు పద్మారావుగారు నన్ను సీఎం గారికి పరిచయం చేశారన్నారు. అప్పుడు నన్ను చూసిన సీఎం కేసీఆర్ గూగుల్ కదా! అన్నారని తెలిపారు.
ప్రచారంలో కేటీఆర్ వచ్చినప్పుడు ఆయనతో సెల్ఫీ తీసుకున్నానని చెప్పారు. సెల్ఫీలే దిగుతున్నవా..? ప్రచారం కూడా చేస్తున్నవా? అని కేటీఆర్ అడిగారని చెప్పుకొచ్చారు. బాగా ప్రచారం చేస్తున్నవటగా! అని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారని తెలిపారు.
ఇన్ని రోజులు నన్ను చూసి కరాటే రాజు కూతురు అనేవారని, కానీ ఇప్పుడు కార్పొరేటర్ హేమ వాళ్ల నాన్న అని డాడీ గురించి మాట్లాడుతున్నరని చెప్పారు. కొత్తగా అనిపించినా, తెలంగాణ సర్కార్లో భాగమైనందుకు గర్వంగా ఉందిన్నారు. కేసీఆర్ ఆలోచనా తీరు అద్భుతమని ప్రశించిన హేమ, భావితరాల గురించి ఆలోచించి ఆయన తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయన్నారు.
బస్తీల్లో ఉండే ప్రజల బాధలు నాకు తెలుసుని, ఎందుకంటే నేను కూడా బస్తీవాసినని ఆమె చెప్పారు. తాను ఉండేది కూడా కిరాయింట్లోనేనని చెప్పుకొచ్చారు. ట్యాంకర్ వస్తే నీళ్ల కోసం కాలనీలు చిన్నపాటి యుద్ధక్షేత్రాన్నే తలపిస్తాయన్నారు. కొన్నిసార్లు ఆ యుద్ధభూమిలో నేను కూడా సైనికురాలిగా ఉన్నా (నవ్వుతూ)నని చెప్పారు.
అందుకే సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ నల్లా, స్వచ్ఛ హైదరాబాద్తో డ్రైనేజీ సమస్య లేకుండా పనిచేస్తానన్నారు. అవసరమైతే దీనికోసం యువత మద్దతు తీసుకుంటానన్నారు. ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా... ఇవ్వని వాగ్దానాలు కూడా తీర్చేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.