గూగుల్ టెక్కీ భార్య ఆత్మహత్య: న్యూడ్ ఫొటోలు ఆన్లైన్లో పెడతానని...
గూగుల్ టెక్కీ భార్య తన వివాహ వార్షికోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకుంది. న్యూడ్ ఫొటోలు ఆన్లైన్లో పెడతానని అతను బెదిరిస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి.
హైదరాబాద్: తొలి వివాహ వార్షికోత్సవం రోజునే గూగుల్ టెక్కీ భార్య ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సి. భాగ్యలక్ష్మి (30) అనే మహిళ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఎఎండి)లో పనిచేస్తోంది.
అదనపు కట్నం ఇవ్వకపోతే తన న్యూడ్ ఫొటోలను ఆన్లైన్లో పెడతానని తన భర్త తనను వేధించాడని ఆమె హైదరాబాదులోని బేగంపేట మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొత్తం వేతనమంతా తనకే ఇవ్వాలని ఆమె భర్త ఎస్. శశిధర్ తనను బలవంతపెడుతూ వచ్చాడని కూడా బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భాగ్యలక్ష్మి సూసైడ్ నోట్ రాసి ఎఎండి క్వార్టర్స్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శశిధర్పైనా అతని తల్లిదండ్రులపైనా పోలీసులు వరకట్నం వేధింపుల కేసును నమోదు చేశారు. అయితే శశిధర్ను అరెస్టు చేయలేదు.
తన భర్త పోలీసులకు లంచం ఇచ్చి ఉంటాడని భాగ్యలక్ష్మి తన సూసైడ్ నోట్లో భాగ్యలక్ష్మి రాసింది. తన శవాన్ని గానీ తన వస్తువులను గానీ శశిధర్ తాక కూడదని ఆమె కోరుకుంది. తల్లిదండ్రులకు, శివకు సారీ చెప్పింది. మార్గదర్శక సూత్రల మేరకు ఆ దంపతులకు తాము కౌన్సెలింగ్ చేస్తూ వస్తున్నామని బేగంపేట మహిళా ఇన్స్పెక్టర్ జానకమ్మ అంటున్నారు. రెండు సార్లు కౌన్సెలింగ్ చేశామని, మూడు సెషన్స్ కౌన్సెలింగ్ చేసిన తర్వాత కేసు పెట్టడానికి వీలవుతుందని ఆమె వివరించారు.
శనివారంనాడు భాగ్యలక్ష్మిని చూడడానికి తల్లిదండ్రులు ఎఎండి క్వార్టర్స్కు వచ్చారు. అయితే, తలుపు ఎంతగా తట్టినా తీయలేదు. దీంతో వారు తలుపు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించే సరికి ఉరికి వేలాడుతూ ఆమె కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత శశిధర్, భాగ్యలక్ష్మి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి శశిధర్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. తాగి వచ్చి శశిధర్ తిట్టం ప్రారంభించాడు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తామిద్దరు చాలా సన్నిహితంగా కలిసి ఉన్న కొన్ని ఫొటోలను మొబైల్ ద్వారా చిత్రీకరించి, భాగ్యలక్ష్మిని అతను వేధిస్తూ వచ్చాడు.
వేధింపులు భరించలేక పెళ్లయిన ఆరు నెలల తర్వాత తన అత్తామామలు మంజులు, భాస్కర్ రావులకు దూరంగా భాగ్యలక్ష్మి ఉంటూ వచ్చింది. భర్తను తనతో ఉండాలని ఆమె అడుగుతూ వచ్చింది. కానీ, అతను తన కూతురిని వేధిస్తూ వచ్చాడని భాగ్యలక్ష్మి తండ్రి కృష్ణ ఆరోపిస్తున్నారు.