రూ.2వేల నోటులో తప్పులు! నోట్లు వెనక్కి తీసుకుంటున్నారంటూ వదంతులు
హైదరాబాద్ : కొత్త నగదు నోట్లతో ఓవైపు సామాన్యులు అష్టకష్టాలు పడుతుండగానే.. రూ.2వేల నోట్లపై ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. రూ.2వేల నోటును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని వదంతులు వ్యాపించడంతో.. సామాన్యులు మరింత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశముంది.
నోట్లను వెనక్కి తీసుకోవడానికి కారణం.. నోటుపై ముద్రించిన ఆయా భాషల్లో పొరపాట్లేనని సోషల్ మీడియా వేదికగా వదంతులు వేగంగా విస్తరిస్తున్నాయి. కాగా, రూ.2వేల నోటుపై 'రెండు వేల రూపాయలు' అన్న అర్థ వచ్చేలా మొత్తం భారతీయ 15భాషల్లో ముద్రించారు.
అయితే, 'దోన్ హజార్ రూపయా' 'దోన్ హజార్ రుపయే' అని మరాఠి, కొంకణి భాషల్లో ముద్రించిన అక్షరాల్లో పొరపాట్లు దొర్లాయని, అందువల్లే ప్రభుత్వం నోట్లను వెనక్కి తీసుకుంటుందంటూ లేని ప్రచారమొకటి విపరీతంగా జరుగుతోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని పలువురు వదంతులను కొట్టిపారేస్తున్నారు.