ఇద్దరు సీఎంలకు మళ్లీ గవర్నర్ విందు! వైఎస్పై కెసిఆర్ వ్యాఖ్య, వైసీపీ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు మరోసారి ఎదురుపడే అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈ నెల 10వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు.
రాజ్ భవన్లో ఆయన ఇఫ్తార్ విందు ఇస్తారు. ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్లకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో అయినా ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురుపడతారా చూడాలి. నెల రోజులకు పైగా ఓటుకు నోటు,ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఉంది.
ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురు పడతారా, చేతులు కలుపుకుంటారా లేక ముఖం తిప్పేసుకుంటారా అనేది సస్పెన్స్. కొద్ది రోజుల క్రితమే గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ వచ్చిన సందర్భంగా విందు ఇచ్చారు. దీనికి ఇద్దరు సీఎంలను పిలిచినా కెసిఆర్ గైర్హాజరయ్యారు.
వైయస్ జయంతి జరుపుతాం: పొంగులేటి
దివంగత నేత వైయస్ జయంతి వేడుకలను జూలై 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, వైయస్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
పొన్నం ఆగ్రహం
ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుంచి నేటి వరకు ఇచ్చిన హామీలు, పురోగతిపై తెలంగాణ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తిరుగులేదనే రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్కు ప్రజలు ఎదురుతిరిగే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఏడాది పాలనలో హామీలు గుప్పించారు తప్ప ఒక్కపని చేయలేదన్నారు.