గవర్నర్గా నరసింహన్: తాత్కాలిక పొడిగింపు, కేంద్రం ప్లాన్ ప్రకారమే..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవి కాలం మంగళవారం తాత్కాలికంగా పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పదవిలో కొనసాగాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనను కోరారు.
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవి కాలం మంగళవారం తాత్కాలికంగా పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పదవిలో కొనసాగాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనను కోరారు.
నరసింహన్ పదవీ కాలం ఈ రోజు (మంగళవారం)తో ముగిసింది. దీంతో ఆయనను కొనసాగిస్తారా లేదా అనే చర్చ జరిగింది. కేంద్రం ఆయనను తాత్కాలికంగా కొనసాగాలని సూచించింది. ఆయనను మరో విడత కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం తర్వాతనే తేలేలా కనిపిస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికలు
నరసింహన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గవర్నర్గా నియమితులయ్యారు. గతంలో ఆయనకు పదవీకాలం పొడిగించారు. అయితే జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందువల్ల కొనసాగించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలించనట్లు ముందుగానే ప్రచారం జరిగింది. తాత్కాలికంగా పొడిగించడం ద్వారా రాష్ట్రపతి ఎన్నికల వరకు ఆయన ఉండే అవకాశముంది.
ఇదీ నరసింహన్!
తమిళనాడుకు చెందిన నరసింహన్ 2006 డిసెంబరు 31న కేంద్ర నిఘా విభాగం సంచాలకునిగా పదవీ విరమణ పొందారు. 2007 జనవరి 25న తొలిసారి చత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2010 జనవరిలో బదిలీపై ఉమ్మడి ఏపీకి వచ్చారు. 2012 మే 3న మొదటి విడత పదవీ కాలం ముగియడంతో 2012 మే మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం ఇక్కడే మళ్లీ నియమించింది.
మూడోసారి దక్కకపోవచ్చు
2014 జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్భవించగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగుతున్నారు. మంగళవారంతో రెండో విడత పదవీకాలమూ ముగిసింది. నరసింహన్ను కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయం వెల్లడి కాలేదు. గతంలో మూడు దఫాలుగా ఎవరూ కొనసాగలేదంటున్నారు.
రోశయ్యకు నో
నరసింహన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఇలా ఓ ప్రభుత్వం నియమించిన వారిని మరోప్రభుత్వం తిరిగి నియమించిన దాఖలాలు గతంలో లేవు. తమిళనాడు గవర్నర్గా ఉన్న రోశయ్యను పదవీ కాలం ముగిసిన తర్వాత కొనసాగించాలని వచ్చిన అభ్యర్థనలు కేంద్రం తోసిపుచ్చింది.
దీంతో ఆయన పదవీ విరమణ చేయగా, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నరసింహన్ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ మరోసారి పొడిగించే అవకాశం లేదని, కేవలం రాష్ట్రపతి ఎన్నికల వరకు తాత్కాలికంగా కొనసాగిస్తారంటున్నారు.
తెలుగు రాష్ట్రాలతో సఖ్యత
రానున్న జులైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సఖ్యత దృష్ట్యా ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు నరసింహన్ సేవలను వినియోగించుకోవాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయనను తాత్కాలికంగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.