చంద్రబాబు మాట: మోత్కుపల్లికి గవర్నర్ పోస్ట్, అమిత్ షా హామీ?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కల నెరవేరనుందా? టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ఇచ్చిన హామీ నెరవేరనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కల నెరవేరనుందా? టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ఇచ్చిన హామీ నెరవేరనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మోత్కుపల్లికి గవర్నర్ పదవి అనే అంశం చాలా కాలంగా ప్రచారంలో ఉంది.
కానీ అది ఇప్పటి దాకా నెరవేరలేదు. ఇప్పుడు మోత్కుపల్లి ఆశలు తీరేలా కనిపిస్తున్నాయంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను మోత్కుపల్లి నర్సింహులు కలిశారు. కేంద్రం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే ప్రయత్నాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇచ్చే అవకాశముందని అటు టిడిపి వర్గీయుల నుంచి ఇటు బిజెపి వర్గీయుల నుంచి బాగానే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా త్వరలో గవర్నర్ల మార్పులపై నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లికి అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇది వరకు పలుమార్లు మోత్కుపల్లి పేరు తెరపైకి వచ్చినట్లు ఆ మధ్య అనేక వార్తలు వచ్చాయి. అయితే దానిపై అటు కేంద్ర ప్రభుత్వం కాని ఇటు టీడీపీ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా అమిత్ షాను మోత్కుపల్లి కలుసుకోవడంతో అప్పటి వార్తలకు ప్రస్తుతం గట్టి బలం చేకూరుతోంది.
అయితే మోత్కుపల్లిని గవర్నర్గా నియమిస్తారా, నియమిస్తే తెలంగాణ గవర్నర్గా నియమిస్తారా లేక ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా అవకాశం కల్పిస్తారా లేక మరే రాష్ట్రానికైనా పంపిస్తారా చూడాలి.