'హైదరాబాద్ టాప్, చేతిరాత పాస్ పోర్టులు ఇక చెల్లవు'
హైదరాబాద్: హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయం దేశంలోనే మొదటి స్ధానంలో ఉందని పాస్ పోర్టు అధికారిణి అశ్వినీ సత్తార్ తెలిపారు. 2014లో రికార్డు స్థాయిలో 14 లక్షల పాస్ పార్టులు జారీ చేసినట్లు ఆమె గురువారమిక్కడ వెల్లడించారు.
2013తో పోలిస్తే గత ఏడాది 13 శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి చేతిరాతతో ఉన్న పాస్ పోర్టులు చెల్లవని హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్టు అధికారి అశ్వినీ సత్తార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు త్వరలోనే విశాఖపట్నం పాస్ పోర్టు ఆఫీస్ ను రీజనల్ కార్యాలయంగా మార్చుతామన్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న విజయవాడ, తిరుపతి పాస్ పోర్టు సేవా కేంద్రాలను కూడా విశాఖపట్నం కార్యాలయానికి బదిలీచేస్తున్నట్లు చెప్పారు.
చేతిరాత పాస్ పోర్టులను మిషన్ రీడబుల్ చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే ప్రతి పాస్ పోర్టులో రెండు పేజీలు ఖాళీగా ఉండాలని, లేకుంటే జంబో పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకోవాలని అశ్వినీ సత్తార్ సూచించారు. 2015లో హజ్ యాత్రకు వెళ్లేవారు పాస్ పోర్టు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ వీసా ప్రమాణాలకు అనుగుణంగా పాస్ పోర్టు కనీస కాలపరిమితి 6 నెలలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి పాస్ పోర్టు దరఖాస్తుదాలు కోసం ఆన్ హోల్డ్ అపాయింట్మెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.