మీకు ప్రేముంటే ఇలా చేయండి: బీజేపీకి హరీశ్ రావు సవాల్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పోరాటాల గడ్డపై ఏది పడితే అది మాట్లాడితే కుదురదని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పోరాటాల గడ్డపై ఏది పడితే అది మాట్లాడితే కుదురదని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. హైకోర్టును విభజించి తెలంగాణపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని బీజేపీ నేతలకు హరీశ్రావు సవాలు విసిరారు.
రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని బీజేపీని డిమాండ్ చేశారు. గురువారం హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం అడిగిన ఏ ఒక్క అంశానికైనా సమాధానాలు చెప్పరా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. అమిత్ షా సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారన్నారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించడం సంతోషకరమని, ముఖ్యమంత్రి విసిరిన సవాలులో ఏ ఒక్కదానికి రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానాలు చెప్పలేదన్నారు.
రూ.లక్ష కోట్లు ఇచ్చామన్నది వాస్తవం కాదని పరోక్షంగా బీజేపీ నేతలు అంగీకరించారని హరీశ్రావు తెలిపారు. పన్నుల రూపేణా కేంద్రానికి తెలంగాణ ఇస్తున్నది రూ.50 వేల కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నది రూ.24 వేల కోట్లు మాత్రమేనన్నారు. దీంతో కేంద్రం.. రాష్ట్రానికి ఇస్తుందా? రాష్ట్రం కేంద్రానికి ఇస్తుందా? అనేది తేలిపోయిందన్నారు.
బీజేపీ నాయకులు భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నం. ఇతర రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేస్తున్నాయని హరీశ్రావు స్పష్టం చేశారు.
అమిత్షా రాష్ట్రం విడిచి వెళ్లకముందే ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారన్నారు. అందరూ ఆశ్చర్యపడేలా పల్లె, పట్టణాలు, నగరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకున్నా ఇచ్చామని, చెప్పుకుంటున్నారని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.