ఎప్పుడు మొదలుపెట్టామన్నది కాదు..! : ఇరిగేషన్ అధికారులతో హరీశ్ రావు
హైదరాబాద్ : మేనమామ కేసీఆర్ తరహాలోనే మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు, వాగ్దాటిలోను మంచి ధిట్ట. సందర్బాన్ని బట్టి సమయస్ఫూర్తితో ఆయన చేసే వ్యాఖ్యలు జనాన్ని ఆకట్టుకుంటాయి. తాజాగా తెలంగాణ ప్రాజెక్టులు, రైతాంగం గురించి నిర్వహించిన సమీక్షా సమావేశంలో హరీశ్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులను కూడా కేటాయించిన ప్రభుత్వం పనుల పర్వవేక్షణలో అప్రమత్తతో వ్యవహరిస్తోంది. అయితే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన నీటి పారుదల అధికారులు మాత్రం ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో తాజాగా నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్ రావు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. గత ప్రభుత్వాల హయాంలో లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనుల జాప్యానికి సంబంధించి కాకమ్మ కథలు చెప్పడం వంటివి చేస్తే వినడానికి ఎవరూ సిద్దంగా లేరని మండిపడ్డారట.
ప్రాజెక్టులకు సంబంధించిన పనుల విషయంలో సీఎం కేసీఆర్, తాను సీరియస్ ధోరణితో ముందుకెళ్తున్నామని.. కాబట్టి అధికారులు కూడా పనుల పట్ల మరింత శ్రద్ద వహించాలని సూచించినట్టుగా సమాచారం. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడు మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు, సాగు కాలానికి పంట పొలాలకు నీరందిస్తున్నామా లేదా అన్నదే కీలకమని అధికారులకు హితవు పలికినట్టుగా తెలుస్తోంది.