చంద్రబాబుకు భారీ షాక్: తెరాసలోకి ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్, ఇక విలీనమే!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా నిలుస్తూ వచ్చిన ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడం ఖాయమైంది. ఆయన బుధవారం సాయంత్రం తెలంగాణ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మరో టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సమావేశయ్యారు.
ఎర్రబెల్లితో పాటు ప్రకాష్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నట్లు హరీష్ రావుతో భేటీ తర్వాత ప్రకటన వెలువడింది.భేటీ అనంతరం హరీష్ రావు కారులోనే ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ ఇద్దరు సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ సమక్షంలో వారిద్దరు గులాబి కండువా కప్పుకున్నారు. దానికి ముందే టీడీపీకి రాజీనామా చేసినట్లు టీడీపీ కార్యాలయానికి ఫ్యాక్స్ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రేపో మాపో పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి, మార్చి 16వ తేదీన కెసిఆర్ ద్వారా రోడ్డు శంకుస్థాపన చేయించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అనుకుని, ఆ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటి దాకా ఆగాల్సిన అవసరం లేదని, ఈలోగా చేరాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఆయనతో చెప్పినట్లు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఇప్పటికే వివేకానంద తెరాసలో చేరారు. రాజేంద్రనగర్ శాసనసభ్యుడు ప్రకాశ్ గౌడ్ కూడా తెరాసలో చేరుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుంది. తన సోదరుడు ప్రదీప్ రావును వరంగల్ కార్పోరేషన్ మేయర్ పదవి ఇవ్వాలనే షరతును ఎర్రబెల్లి దయాకర్ రావు పెడుతున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఎర్రబెల్లి దయాకర్ రావుకు రుచించడం లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రమైన విభేదాలున్నాయి. అయితే వారిద్దరి మధ్య రహస్య సమావేశాలు జరిగినట్లు, ఇద్దరు కూడా చేతులు కలిపినట్లు చెబుతున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ప్రకాష్ గౌడ్ కూడా తెరాసలోకి వస్తే మెజారిటీ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం చీలినట్లు అవుతుంది. అయితే, మరో శాసనసభ్యుడు చేరితే శాసనసభా సభ్యత్వాలకు వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. పార్టీని తెరాసలో విలీనం చేస్తే సరిపోతుంది.
ఈ పరిణామాలకు ముందు పార్టీ ఫిరాయింపులపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారినంత మాత్రాన..పార్టీనే విలీనమైనట్టు భావించాలని చట్టంలో ఎక్కడా లేదని ఎర్రబెల్లి చెప్పారు. గతంలో మా ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకుని కౌన్సిల్లో విలీనమైనట్టు చైర్మన్ ప్రకటించారని ఎర్రబెల్లి తెలిపారు. ఆ నిర్ణయంపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
తెలంగాణలో టిడిపి తరఫున 15 మంది విజయం సాధించారు. ఇప్పటి వరకు ఏడుగురు టిడిపి శాసనసభ్యులు తెరాసలో చేరారు. దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ కూడా చేరితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంటుంది. ఇక టిడిపి తరఫున గెలిచి తెరాసలో చేరిన శాసనసభ్యులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా తెరాసలో విలీనం చేయడానికి మరో సభ్యుడి అవసరమని అంటున్నారు.
టిడిపికి చెందిన మరో శాసనసభ్యుడు తెరాసలో చేరితే మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు తెరాసలో చేరినట్లవుతుంది. దాంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించి టిడిపి శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి అవకాశం చిక్కుతుంది. ఇందుకే కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. మరొకరిని పార్టీలో చేర్చుకుని వీలీనం చేయాలని కోరుతూ స్పీకర్ కు లేఖ ఇచ్చే అవకాశం ఉంది.
అందుకే చేరా...
గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గం, వరంగల్ జిల్లా అభివృద్ధి కావాలనే పార్టీ మారానని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలనే టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు.
కేసీఆర్, టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీని వీడటం బాధగా ఉందని, చంద్రబాబు అంటే తనకు అభిమానమేనని మీడియాతో తెలిపారు. పార్టీ కార్యకర్తలు, పార్టీ పెద్దలు తనను క్షమించాలని ఎర్రబెల్లి కోరారు.
ఇకపై తెలంగాణలో టీడీపీ బతకదని, మిగతా ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి రావాలని కోరుతున్నానని ఎర్రబెల్లి అన్నారు. త్వరలో నిజాంకాలేజిలో బహిరంగసభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో అధికారికంగా చేరతామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. త్వరలోనే వరంగల్ జిల్లాకు చెందిన మరికొంత మంది టీడీపీ నేతలు టీఆర్ఎస్లోకి వస్తారని ఎర్రబెల్లి చెప్పారు.
ఈ తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. టీడీపీ గైడ్లైన్స్ ప్రకారం టీఆర్ఎస్ పార్టీని, మంత్రులను, సీఎంను తిట్టానని, అందరూ పెద్ద మనస్సుతో క్షమించాలని అది పార్టీ డైరక్షన్ మాత్రమేనని ఎర్రబెల్లి చెప్పారు.