ముందుకొస్తే కోరుకున్న పేరు, ఇప్పటికే ముగ్గురు: ఎన్నారైలకు హరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఎన్నారైలకు లేఖ రాశారు. చెరువులను దత్తత తీసుకోవాలని ఆయన లేఖలో ప్రవాస భారతీయులను కోరారు. చెరువులు దత్తత తీసుకొని పునరుద్ధరిస్తే కోరుకున్న పేరు పెడతామని చెప్పారు. ముగ్గురు ఎన్నారైలు చెరువుల దత్తతకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారని, జనవరిలో ప్రవాస భారతీయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని చెప్పారు.
కేసీఆర్తో కేంద్రమంత్రి దత్తాత్రేయ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రంలోని వివిధ శాఖల వద్ద పెండింగులో ఉన్న పలు విషయాల పైన వీరి మధ్య చర్చ జరిగింది.
అదేవిధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో మార్పులు, రాష్ట్రం నుండి పంపించవలసిన ప్రతిపాదన పైన కూడా మాట్లాడారని తెలుస్తోంది.
కొమురవెల్లిలో కేసీఆర్
కొమురవెల్లికి రాజకీయ ప్రాతినిథ్యం లేదని, తప్పకుండా కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. ఆయన ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం స్థానికంగా కార్యక్రమంలో పాల్గొని, ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు ప్రతి అంశాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలించాకే మేనిఫెస్టో తయారు చేశామన్నారు. దొడ్డి కొమరయ్య భవనంకు హైదరాబాదులో ఎకరం భూమి కేటాయిస్తామని, రూ.5 కోట్లతో దొడ్డి కొమరయ్య భవన్ నిర్మిస్తామన్నారు. గొర్రెల పెంపకానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు.