ముంచెత్తిన వాన: రోడ్లన్ని జలమయం, హుస్సేన్ సాగర్లో పెరిగిన ఉధృతి(ఫోటోలు)
ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 514అడుగులు దాటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. సోమవారం మధ్యాహ్నాం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు చాలామేర జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో బోనాల రోజునే వర్షం కురవడంతో వాన చినుకుల్లో తడుస్తూనే చాలా చోట్ల అమ్మవారి పలారం బండిని ఊరేగించారు. ఇక వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో కొన్ని గ్రామాల్లో చీకట్లు అలుముకున్నట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి వర్షం తెరిపినివ్వకపోవడంతో చాలా గ్రామాలు బురదమయంగా మారాయి.
అల్పపీడనం, ద్రోణి కలిసి:
తీవ్ర అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి కలిసి రావడంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు రైల్వేకు సైతం ఆటంకం కల్పిస్తున్నాయి. నాగావళి నదికి భారీ వరద నీరు పోటెత్తడంతో.. నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది.
హుస్సేన్ సాగర్ లో పెరిగిన నీటిమట్టం:
భారీ వర్షాలకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పొంగి పొర్లుతోంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 514అడుగులు దాటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా చోట్లు డ్రైనేజీలు లీకవడం వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నాయి. ఎక్కడ చూసిన చిత్తడితో నగర రోడ్లు కొంత అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోడ్లపై అక్కడక్కడా ఉన్న గుంతలు కూడా వాహనదారులను ఇబ్బందిపెడుతున్నాయి.
అసెంబ్లీ ఎదుట నిలిచిన నీరు:
అసెంబ్లీ కంట్రోల్ రూమ్ ఎదుట సైతం వాన నీరు నిలిచిపోవడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నగరంలో వాన నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది 27సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన జీహెచ్ఎంసీ.. ఆ ప్రాంతాలపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.
పొంగుతున్న నాలాలు:
దాదాపు 16గంటల నుంచి వర్షం కురుస్తుండటంతో.. నాలాలన్ని నిండిపోయాయి. నాలాల నీరు రోడ్ల పైకి వస్తుండటం పాదాచారులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదివే చిన్నారులు పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారుల్లో మెట్రో పనుల కోసం తవ్విన గుంటల్లోను నీరు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ వర్షాలతో గోదావరి జలకళ సంతరించుకుంది.
రైళ్లకు ఆటంకం:
రాయగడ్ - టిట్లాగర్ మధ్య రైళ్ల రాకపోకలు ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల సౌకర్యార్థం విశాఖ, రాయగడ్ మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైలును తిప్పుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ మధ్య రైల్వే ట్రాక్ లో లోపాలున్నట్లు వార్తలు రావడంతో.. ఈ మార్గంలో రైళ్లను నెమ్మదిగా నడిపిస్తోంది రైల్వే. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. తెలంగాణ-ఏపీ ప్రభుత్వాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే ఏర్పాట్లు చేస్తున్నాయి.