ఆమ్మో.. ఈ దారి నరకమే: తెరుచుకున్న హుస్సేన్ సాగర్ ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీగా కురిసిన వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తిగా నిండింది. ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో తూముల నుంచి నీటిని వదిలారు. గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ సాగర్ తూములను తెరిచారు.
నురగలు కక్కుతూ కాలువ ద్వారా మూసీలోకి వెళ్తున్న నీటిని వీక్షించేందుకు జనాలు తరలి వచ్చారు. జలాశయానికి వచ్చిన వరద నీటిని వచ్చినట్టు వదిలేస్తామని అధికారులు చెప్పారు. నీటి మట్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
హైదరాబాద్లో భారీ వర్షం: ప్రభుత్వ ఉద్యోగులకు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి
హుస్సేన్ సాగర్ నీటి విడుదలకు ముందు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. హుస్సే్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.50 మీటర్లుగా ఉంది.
మియాపూర్ టు దిల్సుఖ్నగర్ నరకం
భారీ వర్షం కారణంగా హైదరాబాదులో జనజీవనం స్తంభించింది. కార్యాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో బయలుదేరిన వారు మధ్యాహ్నం పన్నెండు, ఒకటి గంటలకు దిల్ సుఖ్ నగర్ చేరుకుంటున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు
బుధవారం ఉదయం కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. బాధితులకు సాయమందిచేందుకు హెల్ప్లైన్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-21111 111, లేదా 100 నంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యాన్హోల్లు తెరవొద్దని సిబ్బందిని ఆదేశించారు.
నీటి విడుదల
భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నగరం చుట్టుపక్కల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది.
తూముల నుంచి నీటి విడుదల
దీంతో హుస్సేన్ సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. నీటి విడుదల సందర్బంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పలువురు ఇతర అధికారులు హాజరయ్యారు.
హెచ్చరిక
ఈ మేరకు హుస్సేన్ సాగర్ నాలాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు విజ్ఞప్తి చేశారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని సగానికి తగ్గించనున్నారు.
24 గంటల పాటు వర్షాలు
ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా వాయువ్యదిశగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్లో ఈరోజు ఉదయం 11.30 గంటల వరకు 71 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి హైదరాబాద్లో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు.
వర్షపాతం ఇలా..
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల పెద్దేముల్లో 22 సెం.మీ, పరిగిలో 21 సెం.మీ, గండేడులో 13 సెం.మీ, పర్వతగిరిలో 13 సెం.మీ, మిర్యాలగూడలో 11 సెం.మీ, కొత్తగూడెంలో 10 సెం.మీ, కొడంగల్లో 9 సెం.మీ, దర్మసాగర్లో 9 సెం.మీ, హయత్నగర్లో 8 సెం.మీ, బోనకల్, భువనగిరిలో 8 సెం.మీ, భీమదేవరపల్లిలో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తడిసిముద్దైన నగరం
సుమారు మూడు గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ నదీ ప్రవాహాన్ని తలపించాయి.
ట్రాఫిక్ జాం
పలుచోట్ల ఐదడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలలోకి వర్షపు నీరు భారీగా చేరింది. పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రహదారులపై రెండు గంటలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
డ్రైనేజీ వ్యవస్థ
జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ 20 మి.మీ. వర్షపాతాన్ని తట్టుకోగలదని తెలిపారు. ఇవాళ హైదరాబాద్లో 60 మిల్లి మీటర్ల వర్షం కురిసిందని స్పష్టం చేశారు. నగరంలో నిలిచిన వరద తగ్గడానికి మరో రెండు గంటల సమయం పడుతుందన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్లైన్ నెం. 040-21111 111 లేదా 100.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
వర్షాల కారణంగా 10 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మండల రైల్వే అధికారులు తెలిపారు. మరో 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
వాహనాల మళ్లింపు
బంజారాహిల్స్ రోడ్ నెం. 10, నల్లగొండ క్రాస్రోడ్డు, పంజాగుట్ట వద్ద రాకపోకలకు అంతరాయం కలిగింది. మలక్పేట రైల్వే వంతెన కింద నాలా పొంగిపొర్లుతుంది. మలక్పేట టీవీ టవర్ వద్ద నుంచి నింబోలి అడ్డా వైపు వాహనాలను దారి మళ్లించారు.
గంజ్ వద్ద..
మలక్పేట గంజ్ మార్కెట్ వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. ట్రాఫిక్ పోలీసులు డివైడర్లను తొలగించి నీటిని తొలగిస్తున్నారు. ముషీరాబాద్ కాజ్వే వంతెనపై నుంచి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాచారం పీఎస్ పక్కన నాలా పొంగిపొర్లింది.
సోమాజిగూడలో నీట మునిగిన మూడు అపార్టుమెంట్లు
సోమాజిగూడలో మూడు అపార్టుమెంట్లు నీట మునిగాయి. మొదటి అంతస్తు వరకు వర్షపు నీరు చేరుకుంది. లేక్ షోర్ భవనంలో నుంచి దాదాపు పదిహేను కంపెనీల ఉద్యోగులు బయటకు వచ్చారు. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.