డ్రగ్స్ కేసు: విచారణలో ఎదురుగాలి? అన్నిటికీ ‘నో’ అంటున్న నవదీప్, రంగంలోకి సభర్వాల్?
డ్రగ్స్ కేసులో దూసుకుపోతున్న సిట్ అధికారులకు పరిస్థితులు మెల్ల మెల్లగా ఎదురు తిరుగుతున్నాయి. సోమవారం విచారణకు హాజరైన హీరో నవదీప్ అడిగిన ప్రతి ప్రశ్నకూ ‘నో’ అంటున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో దూసుకుపోతున్న సిట్ అధికారులకు పరిస్థితులు మెల్ల మెల్లగా ఎదురు తిరుగుతున్నాయి. సోమవారం హీరో నవదీప్ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.
డ్రగ్స్ కేసు: నిందితులా? బాధితులా?, ఇదే కీలక ప్రశ్న, తర్వాత జరిగేదేమిటి?
అయితే సిట్ అధికారులు తన ముందుంచిన అన్ని ప్రశ్నలకు హీరో నవదీప్ 'నో' అని సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరోయిన్ ఛార్మీ కూడా ఇప్పటికే సిట్ పంపిన నోటీసుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
విచారణకు హాజరైన హీరో నవదీప్...
ఇప్పటికే డ్రగ్స్ కేసులో కొంతమంది సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరో తరుణ్ లను ఇప్పటికే విచారించిన వారు.. వచ్చే నాలుగైదు రోజుల్లో ఎవరెవరిని విచారించాలనే విషయంలో టైం టేబుల్ కూడా వేసేసుకున్నారు. ఆ మేరకే సోమవారం నాటి విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ఈయన తరువాత హీరో రవితేజ, ఆ మరుసటి రోజు హీరోయిన ఛార్మీ, ఆపైన ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్.. ఇలా అందరూ హాజరుకావాల్సి ఉంది.
నవదీప్, తరుణ్ ల పబ్ లలో కొత్త డ్రగ్! కోడ్ చెబితేనే సరఫరా?
Recommended Video
ఇప్పటివరకూ అడిగిన ప్రశ్నలివే...
ఈ ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న నటుడు నవదీప్ ను తొలి 15 నిమిషాల పాటు తమ పేర్లు, హోదాలు చెప్పి పరిచయం చేసుకున్న అధికారులు, ఆపై ప్రశ్నలను సంధించడం మొదలు పెట్టారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారా? అన్న ప్రశ్నకు తనకు అలవాటు లేదని నవదీప్ చెప్పినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారని అడిగితే, డ్రగ్స్ అంటే ఏంటో కూడా తనకు తెలియదని నవదీప్ చెప్పాడని, డ్రగ్స్ ఎలా సేకరిస్తారు? ఎవరి సహకారంతో డ్రగ్స్ అందుతాయన్న ప్రశ్నలకు తనకు తెలియదన్న మాట ఆయన నోటి నుంచి వచ్చిందని తెలుస్తోంది. అయితే, నవదీప్ చెబుతున్న సమాధానాలను మాత్రమే రికార్డు చేస్తున్న అధికారులు, క్రాస్ ఎగ్జామిన్ ను మాత్రం ఇంకా ప్రారంభించలేదు.
అన్ని ప్రశ్నలకూ ‘నో’ ఆన్సర్?
సోమవారం ఉదయం నుంచి సిట్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు హీరో నవదీప్ అడ్డంగా తలూపుతున్నట్లు తెలుస్తోంది. వారు అడిగే ప్రతి ప్రశ్నకు తెలియదని, నో అని మాత్రమే నవదీప్ సమాధానాలు చెబుతుండటంతో ఏం చేయాలో సిట్ అధికారులకు పాలుపోవడం లేదు. అయితే ఇప్పటివరకూ నవదీప్ కు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాలను అధికారులు ఇంకా నవదీప్ ముందు పెట్టలేదని తెలుస్తోంది.
రంగంలోకి అకున్ సభర్వాల్?
డ్రగ్స్ కేసు విచారణలో హీరో నవదీప్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అడిగిన ప్రతి ప్రశ్నకూ ‘నో' అని సమాధానం చెబుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నట్లు సమాచారం. దీంతో మధ్యాహ్న భోజన విరామం తరువాత ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా రంగంలోకి దిగనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సబర్వాల్ వచ్చి కూర్చున్న తరువాత, డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు సంబంధించి తమ వద్ద ఉన్న వివరాలను ఒక్కొక్కటిగా ఆయన ముందుంచి నవదీప్ ను మరింత లోతుగా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.
విచారణకు సహకరిస్తే సరే, లేకుంటే...
విచారణకు సహకరించి తనకు తెలిసినంత వరకు పూర్తి వివరాలు వెల్లడించకుంటే జరగబోయే పరిణామాలను హీరో నవదీప్ కు ఓసారి తెలియజేయాలని కూడా సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నవదీప్ నడుపుతున్న పబ్ లో అత్యంత ముఖ్యులకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక కాక్ టైల్ డ్రింక్ తయారీ, దానిలో కలిపే పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయన్న విషయంపై భోజన విరామం అనంతరం రెండు గంటల పాటు నవదీప్ ప్రశ్నలను ఎదుర్కోవచ్చని తెలుస్తోంది.
కోర్టుకెక్కిన ఛార్మీ...
మరోవైపు హీరోయిన్ ఛార్మీ డ్రగ్స్ కేసుకు సంబంధించి కోర్టుకెక్కింది. ఈ నెల 26 న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. డ్రగ్స్ కేసులో తనకే సంబంధమూ లేకపోయినా సిట్ అధికారులు తనకు నోటీసు పంపించారంటూ సోమవారం హైకోర్టులో హీరోయిన్ ఛార్మీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ ఇన్ ఛార్జి, ఎక్సైజ్ శాఖ కమిషనర్, డైరెక్టర్, ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా తన పిటిషన్ లో పేర్కొన్న ఛార్మీ.. తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా రక్త నమూనాలు సేకరించడం చట్టవిరుద్ధమని కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. ఒకవేళ తనను బలవంతంగా విచారించాలనుకుంటే తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని, విచారణ బృందంలో తప్పనిసరిగా మహిళ ఉండేలా చూడాలని, ఆ పిటిషన్ లో ఛార్మీ కోరింది.
ఈ ఇద్దరే కీలకం.. విచారణ సుదీర్ఘం...
టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న వారిలో డైరెక్టర్ పూరీ జగ్నాథ్, హీరో నవదీప్ లను కీలకమైన వ్యక్తులుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నవదీప్ నటుడిగానేగాక ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా చలామణీ అవుతున్నాడు. ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పార్టీలకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ నవదీప్ చూస్తుంటాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గోవా ముఠాకు సంబంధించిన కీలకమైన సమాచారం నవదీప్ నుంచి రాబట్టొచ్చని సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నవదీప్ విచారణ అంత త్వరగా ముగియదని, సుదీర్ఘ సమయంపాటు విచారించే అవకాశం ఉందని అంటున్నారు.