మీరు మారకుంటే..: తెలంగాణ బిజెపి నేతలకు అధిష్టానం తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు ఆ పార్టీ సీనియర్ నేత శివప్రకాశ్ శుక్రవారం నాడు క్లాస్ పీకారని తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణ కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేధాలు, పని తీరు పైన ఆయన తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.
పెద్ద నాయకుల తీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారని తెలుస్తోంది. పార్టీ స్థితిని మొత్తం మార్చాలని శివప్రకాశ్ హెచ్చరించారని తెలుస్తోంది. తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ ఇక్కడ పరిస్థితి అలా కనిపించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు: పోచారం
తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాల వ్యవహారంలో తనను బర్తరఫ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.
ఉత్తమ్ గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పక్కా గృహాల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, లక్షల ఇళ్లను దొంగ బిల్లులతో అక్రమార్కులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మరమ్మతులు చేసి రైతులకు అప్పగించి వారే నడుపుకునేలా చర్యలు తీసుకుంటున్న తరుణంలో మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో ప్రభుత్వం నియమించిన శాసనసభ కమిటీలో సభ్యుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డి పదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు.