వీసీల నియామకం: కెసిఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు పెండింగ్లో ఉండగా వీసీలను ఎలా నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లు ఆగిన ప్రభుత్వం ప్రభుత్వం రెండు మూడు రోజులు ఆగలేదా అని ప్రశ్నించింది.
వీసిల నియామకాల నిబంధనలను సడలించడాన్ని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై వాదనలు సోమవారం ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విషయం కోర్టులో ఉండగా ఎలా వీసిలను నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు తుది తీర్పునకు లోబడే వీసీల నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాలకు వైస్చాన్స్లర్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, నిజమాబాద్లోని తెలంగాణ వర్సిటీ వీసీగా సాంబశివరావు, తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా ఎస్వీ సత్యనారాయణ, కేయూ వీసీగా సాయన్న, ఓయూ వీసీగా రామచంద్రం, ఆర్జేయూకేటీ వీసీగా సత్యనారాయణ నియమితులయ్యారు.
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు వీసి పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. ఇంచార్జీలు వీసీలు మాత్రమే కొనసాగుతున్నారు.