చెత్త డబ్బాలు: జిహెచ్ఎంసిపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: జిహెచ్ఎంసి((గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)) తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తిపన్ను వసూలుకు ఇళ్ల ముందు చెత్త డబ్బాలు ఉంచడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జిహెచ్ఎంసికి అక్షింతలు వేసింది.
నేరం చేస్తున్నారని జిహెచ్ఎంసిని కోర్టు హెచ్చరించింది. జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఇలా చేయాలని ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తి పన్ను వసూలుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొంది. గంటలోగా చెత్త డబ్బాలు తొలగించాలని ఆదేశించింది. లేనిపక్షంలో కమిషనర్, అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని కోర్టు పేర్కొంది.
చాలాకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న యజమానులపై జిహెచ్ఎంసి ఇటీవల కొత్త ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అనేక సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని యజమానుల ఆస్తుల ముందు అధికారులు చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు.
పదో సర్కిల్ పరిధిలోని 10 నుంచి 20 భవనాల్లో ఆస్తి పన్ను చెల్లించని యజమానులను గుర్తించి గురువారం చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. ఇకనైనా యజమానులు స్పందిస్తారనే ఇలాంటి చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చెత్త డబ్బాల వల్ల పరిసర ప్రాంతాల వారికి అంటువ్యాధులు, ఇతరత్రా వ్యాధులు సోకే అవకాశం ఉందని పలువురు కోర్టును ఆశ్రయించడం కోర్టు జిహెచ్ఎంసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే చెట్ట డబ్బాలను తొలగించాలని ఆదేశించింది.