ఆ తర్వాతే కూల్చండి, ఎందుకో చెప్పండి : కేసీఆర్కు హైకోర్టు ఝలక్!
హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పైన జీహెచ్ఎంసీకి శుక్రవారం నాడు షాక్ తగిలింది. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాళాలు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మించడంతో ఇది జరిగింది.
దీంతో నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఐదు రోజులుగా కట్టడాల కూల్చివేత కొసాగుతోంది. దీనిపై కొందరు భవన యజమానులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు శుక్రవారం జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ నిర్మాణాలు కూల్చేముందు యజమానులకు నోటీసులు జారీచేయాలని సూచించింది. నిర్మాణదారులు వివరణ ఇచ్చేందుకు మూడు వారాలు గడువు ఇవ్వాలని, గడువు ముగిశాక ఎందుకు కూల్చివేస్తున్నారో ఉత్తర్వుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిర్మాణదారులకు ఉత్తర్వులు అందేవరకు కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ఓ విధంగా ఝలక్.