ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై హైకోర్టు విచారణ: కోర్టు విభజనపై కేంద్రమంత్రితో ఎంపీలు
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై అందిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతకు ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయలేదు కాదా? అని పిటిషనర్ను హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.
ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతకు సంబంధించి ఏమైనా ఆధారాలుంటే ఇవ్వాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కూల్చివేతపై వారంలో ప్రభుత్వ ఉత్తర్వులను పొందుపర్చాలని పిటిషనర్కు ఆదేశించింది.
ఇది ఇలా ఉండగా, ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చకూడదని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే నిర్మాణానికి మరమ్మతులు చేయాలని కోరారు.
కాగా, ప్రభుత్వం మాత్రం ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి అక్కడే కొత్త ఆస్పత్రిని నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటికే ఉస్మానియా ఆస్పత్రిలోని పలువురు రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థలో ఉందనీ, జరగరానిదేదైనా జరిగితే.. ఆస్పత్రిలోని రోగుల ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
న్యాయశాఖ మంత్రిని కలిసిన టిఆర్ఎస్ ఎంపీలు
హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మంగళవారం కలిశారు. వెంటనే హైకోర్టును విభజించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది గడుస్తున్నా హైకోర్టు విభజనలో జాప్యం కొనసాగుతూనే ఉందని చెప్పారు.