సిబిఐకి ఇవ్వలేం: నోటుకు ఓటు కేసుపై హైకోర్టు, పిటిషనర్పై ఆగ్రహం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఈ రెండు కేసులను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్లో ప్రజా ప్రయోజనం ఏమీ తమకు కనిపించలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లో ప్రజా ప్రయోజనం కనిపించలేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కారణంతోనే కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించడం కుదరదని చెప్పిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓ ఎమ్మెల్యే ఓటును కొనేందుకు మరో ఎమ్మెల్యే యత్నించడం, రెండు రాష్ట్రాల మధ్య పెను వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదలాయించాలని న్యాయవాది పీవీ కృష్ణయ్య పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సీబీఐకి బదలాయించడం కుదరదని తేల్చేసింది.
ఓటుకు నోటు కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఓసారి, ఆశ్రయించలేదని మరోసారి చెబుతూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా పిటిషనర్ వ్యవహరించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.