అగ్రిగోల్డ్పై కమిటీ: ఈ-వేలం పద్ధతిలో ఆస్తుల అమ్మకానికి హైకోర్టు ఓకే
హైదరాబాద్: అగ్రిగోల్డ్ పైన ముగ్గురు సభ్యుల కమిటీని హైకోర్టు నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల అమ్మకాల ప్రక్రియను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరపాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని వేలాది మందిని ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి అంశంలో హైకోర్టు కోర్టు శుక్రవారం నిర్ణయం ప్రకటించింది. అధిక వడ్డీల ఆశ చూపి జనం నెత్తిన కుచ్చటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ మరోమారు మోసానికి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది.
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఆస్తుల విక్రయాలన్నీ న్యాయస్థానం నియమిస్తున్న కమిటీ పర్యవేక్షణలోనే జరగాలని షరతు విధించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ అమ్మకాలతో పాటు బాధితులకు సొమ్ము చెల్లింపులను కూడా కమిటీ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. దీనికి అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా ఆమోదించింది. ఆస్తులను ఈ - వేలం పద్ధతిలో విక్రయించాలని హైకోర్టు సూచించింది.
అగ్రిగోల్డ్ కోర్టును తప్పుదోవ పట్టిసతే చర్యలు తప్పవని హెచ్చరించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని సూచించింది. ఎప్పటికప్పుడు పురోగతిని కోర్టుకు చెప్పాలని ఆదేశించింది. మొదటి విడతలో 14, రెండో విడతలో 6 ఆస్తులు విక్రయించాలని చెప్పింది. కమిటీకి నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరును 12వ తేదీన ప్రకటిస్తామని తెలిపింది.