పరువు హత్య: ప్రేమించిన కూతుర్ని ఉరేసి చంపిన తల్లిదండ్రులు
ఆదిలాబాద్: పరువు కోసం కన్న తల్లిదండ్రులే పగవాళ్లుగా మారిపోతున్నారు. పేగును పంచుకు పుట్టిన పిల్లలని కూడా చూడకుండా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా, వేరే కులం వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుందనే కారణంగా కన్న కూతురునే దారుణంగా చంపేశారు ఓ దుర్మార్గపు తల్లిదండ్రులు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంకు చెందిన నిందితుడు చౌహాన్ లక్ష్మణ్ పెద్ద కుమార్తె అఖిల(17) ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటోంది.
కాగా, నేరడిగొండ ఎమ్మార్వో కార్యాలయంలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్తో అఖిలకు గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఏడాది నుంచి వారు తరచూ కలుసుకుంటున్నారు. అయితే, కులం వేరే కావడంతో ఆ యువకుడితో తిరుగొద్దని పలుమార్లు హెచ్చరించారు. అయినా అఖిల వారి మాటలు పట్టించుకోలేదు.
కాగా, గురువారం రాత్రి మహేందర్కు ఫోన్ చేసిన అఖిల.. తన తల్లిదండ్రుల పోరుతో ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పింది. దీంతో మహేందర్ వెంటనే ఆమె ఇంటికి వచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మహేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.
వేరే కులానికి చెందిన అతడ్ని మర్చిపోవాలని ఎంత చెప్పినా అఖిల వినిపించుకోలేదు. ఈ క్రమంలో పట్టలేని ఆవేశంలో పురుగుల మందు తాగిన అఖిలను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి, శుక్రవారం తెల్లవారుజామున అఖిల మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు ఆమె తల్లిదండ్రులు.
ఆ తర్వాత తమ కూతురును తామే చంపేశామంటూ విషయం చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సమాచారం అందుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.