కన్న ప్రేమను చంపేశారు: ప్రేమ పెళ్లిని నిరాకరించి పరమేశ్వర్ దారుణ హత్య
హైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమకు ఇష్టం లేకుండా ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేసిన కన్న కొడుకునే దారుణంగా హతమార్చాడు ఓ దుర్మార్గపు తండ్రి. ఈ హత్యలో అతని సోదరులు కూడా సహకరించడం గమనార్హం. ముందు ఆత్మహత్యగా భావించినప్పటికీ పోస్టుమార్టం నివేదికలో తీవ్రగాయాలైనట్లు తేలడంతో దర్యాప్తు జరిపిన పోలీసులకు ఈ దారుణ విషయం ఆలస్యంగా తెలిసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... శంషాబాద్లోని ఆర్బీనగర్లో రైతు సోమేశ్వర్రెడ్డి నివాసముంటున్నాడు. అతని కొడుకు పరమేశ్వర్రెడ్డి(21) ఇంటర్మీడియట్ చదివి తండ్రి, సోదరులకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నాడు.
కాగా, పరమేశ్వర్రెడ్డి.. శంషాబాద్లో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమించానని, ఆమెనే పెళ్లిచేసుకుంటానంటూ తండ్రికి చెప్పగా తండ్రితోపాటు సోదరులు కూడా వ్యతిరేకించారు. ఈ క్రమంలో కుటుంబసభ్యుల మాట వినకుండా పెళ్లికి సిద్ధపడిన పరమేశ్వర్రెడ్డి మార్చి 27న అకస్మాత్తుగా మృతి చెందాడు. సోదరులతో గొడవ పడటం, తనకు ఉద్యోగం లేదన్న మనస్తాపంతో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.
పోలీసులకు ఈ సమాచారం తెలియడంతో.. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పరమేశ్వర్రెడ్డి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇటీవల పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందడంతో తొలిసారిగా పరమేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది.
కుటుంబసభ్యులే పరమేశ్వర్ రెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారనే వాదన బలపడింది. దీంతో దర్యాప్తు వేగవంతం చేసి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. హత్యకేసు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు.