పూనకాలతో ఊగిపోయిన కస్తుర్బా పాఠశాల విద్యార్థినులు: పోలీసుల విచారణ
వరంగల్: జిల్లాలోని ఏటూరునాగారం కస్తుర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు, ఓ వర్కర్ పూనకాలతో ఊగిపోయారు. పాఠశాల మొత్తం కేకలు వేసుకుంటూ తిరిగారు. దీంతో మరికొందరు వర్కర్లు మిగితా విద్యార్థులను గదిలో బంధించి పూజలు చేయడం మొదలు పెట్టారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. పూనకంతో ఊగిపోతున్న ఓ మహిళా వర్కర్ వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిపైకి ఊగిపోతూ వచ్చింది. వెళ్లిపోమ్మంటూ చేతులు ఊపింది.
పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల వార్డెన్ను అదుపులోకి తీసుకుని ఘటనపై విచారిస్తున్నారు. పాఠశాలలో అందరూ విద్యార్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే కావడం, మూఢనమ్మకాల ప్రభావం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
180 మంది విద్యార్థులున్న పాఠశాలలో ప్రస్తుతం కొంత భయానక వాతావరణం నెలకొంది. ఇద్దరు పదవ తరగతి విద్యార్థినులు, ఓ పాఠశాల వర్కర్ పూనకం వచ్చి ఊగిపోయారని పాఠశాల సిబ్బంది తెలిపారు.