జర్మనీ వెళ్లి తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీ
హైదరాబాద్: జర్మనీ వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాదులోని బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో రిగింది. స్థానిక సిక్ విలేజీలోని కార్తిక్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న మోహన్ కనోడియా 15 రోజుల క్రితం జర్మనీ వెళ్లారు.
సోమవారం తెల్లవారు జామున ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు, కిటికీ రెక్కలతో పాటు బీరువా తలుపులు విరిగి కనిపించాయి. లోపలికి వెళ్లి చూస్తే బీరువాలో దాచిన బంగారు ఆభరణాలతో పాటు 76 గ్రాముల వెండి నాణేలు, లక్షన్నర నగదు, తొమ్మిది వాచీలు కనిపించలేదు.
ఇంటి వాచ్మన్గా బహదూర్ అనే వ్యక్తిని కాపలాగా పెట్టానని, అతను కనిపించడం లేదని మోహన్ కనోడియా చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, సికింద్రాబాదులోనే మరో సంఘటన జరిగింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళ దృష్టి మళ్లించి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్ అపార్టుమెంటులోమంగళవారంనాడు జరిగింది.
మధ్యాహ్నం సమయంలో ఆపార్టుమెంట్లో ఫ్లాట్ అద్దెకు దొరుకుతుందా అని స్థానిక మహిళను అడిగిన ఇద్దరు దుండగులు ఆ చోరీకి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత తన గొలుసు మాయం కావడాన్ని గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.