బోరబండలో దారుణం: నెలరోజులుగా బాలికపై ఇంటి ఓనర్ అత్యాచారం
హైదరాబాద్: బోరబండలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఇంటి యజమాని నెలరోజులుగా అత్యాచారం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేకాదు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... బోరబండలో నివాసం ఉంటున్న ఓ బాలికను లోబరచుకున్న ఇంటి యజమాని గత నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారుమంగళవారం షీ టీమ్స్ చీఫ్ స్వాతి లక్రాను ఆశ్రయించారు.
అనంతరం కుమార్తెపై ఇంటి యజమాని చేసిన దారుణం గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని స్వాతి లక్రా జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు. బాలికపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇంట యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
యువతిపై అత్యాచారం, ఆపై హత్య
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వెనకభాగంలోని చెట్ల పోదలలో సోమవారం ఉదయం హత్యకు గురైన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వేములవాడ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రదేశంలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉందనే సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి యువతి మృతదేహాన్ని పరిశీలించామన్నారు. అత్యాచారం చేసిన తర్వాత చున్నితో ఉరివేసి బిగించి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామన్నారు.
మృతురాలును గౌడ కల్పన (30) తంగళ్లపల్లి స్వస్థలంగా గుర్తించారు. ఆమె భర్త శ్రీనివాస్ గతకొద్దిరోజుల క్రితం ఒక వివాహం నిమ్మిత్తం షోలాపూర్ వెల్లి ఇంకా తిరిగి రాలేదని, కల్పనకు సన్నిహితుడైన వ్యక్తే నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం గావించి హత్య చేసినట్లుగా తెలుస్తోందని సిఐ తెలిపారు.
కాగా మృతురాలి మెడలో బంగారు పుస్తెలతాడు అలాగే ఉండటం, పెద్దగా ప్రతిఘటించినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తే నమ్మించి ఇక్కడి తీసుకువచ్చి ఈ ఘతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మృతురాలి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లోని నెంబర్లను పరిశీలిస్తున్నామని, అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మృతురాలు కల్పనకు ఇద్దరు పిల్లలు ఉండగా జీవనోపాధి నిమ్మిత్తం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో నివాసం ఉంటుంది.