ఏముఖంతో: బాబుపై హరీష్, మేం చవటలమా: రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో ఉనికి కోసమే తెలుగుదేశం పార్టీ ఆరాటపడుతున్నదని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం అన్నారు. కరెంట్ కష్టాలకు కారణమైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో పర్యటిస్తారన్నారు.
మెదక్ జిల్లా సిద్దిపేటలోని తన నివాసంలో ఆదివారం హరీశ్ విలేకరులతో మాట్లాడారు. తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందంటూ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాక రావు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్లి అడిగితే తాము ఏం చేశామో అక్కడి ప్రజలే చెబుతారన్నారు.
తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిలో పదో వంతైనా చంద్రబాబు హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. ఎస్సీలకు సాగునీటి సౌకర్యం ఉన్న మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాలో రూ.19 కోట్లు వెచ్చించి భూమి కొనుగోలు చేశామని చెప్పారు.
ఇంకా రూ.20 కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో కరెంట్ కష్టాలు దాపురించాయన్నారు. ఆంధ్రలో పంటలు ఎండిపోతున్నాయంటే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో నీళ్లు ఇచ్చారని కొనియాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. మరోవైపు, మిషన్ కాకతీయకు హరీష్ రావు ఎన్నారైల మద్దతు కోరారు.
ఉత్తర తెలంగాణ ఆధిపత్యం వద్దు: రేవంత్ రెడ్డి
ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినవారు దక్షిణ తెలంగాణ పైన పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, ఇది ఎంతమాత్రం తగదని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో సమర్థులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లేకుంటే ఇక్కడి వారు చవటలు, దద్దమ్మల్లా అని సీఎం, తెరాస అధినేత కేసీఆర్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఆయన పాలమూరు జిల్లా కోస్గిలో తెరాస పైన మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్కు టిక్కెట్ ఇచ్చి నిలుపుతోందని, ఈ మూడు జిల్లాల్లో ఒక్కరూ అర్హులు లేరా అని ప్రశ్నించారు. కీలక పదవులన్నీ వారి చేతుల్లోనే పెట్టుకొని ఈ ప్రాంతం వారిని దూరంగా ఉంచుతున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.